తెలంగాణాపై ఏమాత్రమూ అవగాహన లేకుండా ఈమధ్య 'తెలంగాణా ప్రశ్నలకు ప్రశ్నలు' అనే శీర్షికతో వచ్చిన ఓ ఆర్టికిల్ చదవటం తటస్థించింది। 'పేరు మాత్రమే గొప్ప' అన్న తరహాలో ఉన్న ఆ వ్యాసాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినా, ఆ వ్యాసకర్త కున్న కొన్ని దురభిప్రాయాలు, ఆయనకున్న అవగాహన చూసి నవ్వుకోవాల్సివచ్చింది.
ఎస్సార్సీ అంటే ఏమిటో కూడా తెలియదు ఆయనకు। ఎస్సార్సీ అనేది ఒక కమిటీ. అది కేవలమూ ఒక నివేదిక ద్వారా ప్రతిపాదనో లేదంటే రికమండేషనో చేయగలదు. కానీ, ఆయన మాత్రం అది తీర్పులిస్తుందంటారు!! అప్పట్లో మొదటి ఎస్సార్సీ ఇచ్చిన తీర్పు ఇప్పటి కాలమాన (వాతావరణం కూడా లిస్టులో పెట్టేసారు) పరిస్థితులకు పనికిరాదని కూడా ప్రకటించేసారు.
అయ్యా, ఏదో మేథావితనంతో వ్రాస్తున్నామనుకుంటూ, తెలంగాణాను వేళాకోళం చేస్తున్నారు। అది తప్పు. ఇంకా ఏవేవో అసంబద్ధమైన ప్రశ్నలైతే వ్రాసారు కానీ గుర్తులేవు. మళ్ళీ చూద్దామనుకుంటే, ఆయన మాత్రం ఆ వ్యాసానికి తాళం బిగించుకున్నారు. ఆయన సంగతి పక్కనపెట్టి, గతంలో 'ప్రత్యేక తెలంగాణా' శీర్షికన నేను వ్రాసిన ఓ వ్యాసంపై వచ్చిన కొన్ని అభిప్రాయాలకు వ్యాసం రూపంలోనే సమాధానం ఇస్తాను।
ఆ వ్యాసానికి స్పందిస్తూ, నా బ్లాగులో ఓ 'తెలుగు అభిమాని' 'మూడు ముక్కలు చేసుకుని నీళ్ళకోసం మూడు ప్రాంతాల తెలుగు వాళ్ళు కొట్టుకుంటుంటే బాగుంటుందా చెప్పు' అని అడిగారు। బానే ఉంది. కొట్టుకుంటే బాగోదని, మనం బాబ్లీ విషయంలో మహారాష్ట్రతోనూ, ఆల్మట్టి విషయంలో కర్ణాటకతోనూ గొడవపడకుండా ఆగామా? వాళ్ళూ మనలాగే భారతీయులేగా అని మిన్నకుండిపోలేదే మరి?
అంతకన్నా ఆశ్చర్యకరమైన, హాస్యాస్పదమైన వ్యాఖ్య శ్రీ తాడేపల్లి లలితాసుబ్రహ్మణ్యంగారు చేసారు। తెలంగాణాది సాంస్కృతిక సమస్యట!! ఆయన మాటల్లోనే చదవండి. "తెలంగాణా సమస్య సాంస్కృతికమైనది। ఆర్థికం కాదు. తెలంగాణాలో తెలుగు సంస్కృతి పూర్తిగా క్షీణదశకు తేబడింది. మిగతా తెలుగువారితో ఇక్కడి తెలుగువారు మమేకం కాలేకపోవడానికి ఇదే కారణం. This is a culturally impoverished region. అందువల్ల ఈ ప్రాంతం వెనకబడిపోయింది. ముందు సాంస్కృతికంగా బాగుచెయ్యడానికి పూనుకుంటేనే ఆర్థికంగా బాగుచెయ్యగలం."
ఇంకా నయం. తెలంగాణా సమస్య సాంస్కృతికమైనదే అన్నారు. అది తెలంగాణావారి 'మానసిక సమస్య'గా చెప్పనందుకు సంతోషించాలేమో!
ఇంకా 'గ్రంధాలయోద్యమాన్ని' అక్కడ చేపట్టాలని ఆయన సెలవించారు। ప్రజలు తెలుగుభాష నేర్చుకోటానికి, తెలుగులో ప్రభుత్వ వ్యవహారాలు సాగేందుకు వీలుగా మాడపాటి హనుమంతరావుగారి ఆధ్వర్యంలో 'గ్రంథాలయోద్యమం' మొదలయ్యింది తెలంగాణాలోనే అన్న విషయం బహుశా మీకు తెలిసుండదు.
అసలు తెలంగాణా ఉద్యమానికి ఉన్న చారిత్రక నేపథ్యం తెలియకుండా, తెలంగాణావాదాన్ని వేళాకోళం చేస్తూ ఈ కుహానా మేథావులు ఏం సాధిద్దామనుకుంటున్నారో అర్ధం కాదు। దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దాదాపు సంవత్సరానికి నిజాం నిరంకుశపాలన నుండి తెలంగాణా విముక్తమయ్యిందన్న విషయం వీరికి తెలుసా? స్వతంత్రభారతంలో పరాధీనగా మిగిలిన 'కోటి రతనాల వీణ' చేసిన 'సాయుధపోరాటం'లో అసువులు బాసిన అమరవీరులెందరన్నది వీరికి తెలుసా? 'నీ బాంచన్ దొర' అన్న బానిసలే, విప్లవాగ్నులై ప్రజ్వరిల్లి, ఉప్పెనగా పోటెత్తి నిజాం మెడలు వంచారన్న విషయం వీరికి తెలుసా?
ప్రత్యేక తెలంగాణా వాదంపై, పైత్య ప్రకోపాలు చేసే ఈ పెద్దమనుషులు అసలు తెలంగాణా కలిసి ఉంటే కలిగే లాభాలేమిటనేవి మాత్రం చెప్పరు। తెలంగాణా విడిపోతే కలిగే నష్టాలేమిటన్నది కూడా చెప్పరు. 'పెద్దమనుషుల' ఒప్పందం గురించేమైనా వీరికి తెలుసా? ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఊపందుకున్నప్పుడే, ప్రత్యేక రాయలసీమ, ప్రత్యేక కోస్తా విషయాలు ప్రస్తావించబడటంలోని రాజకీయాలు వీరికి అర్ధం కావా? చెప్పిందే చెప్పెరా.... అన్నట్లు, ప్రత్యేక తెలంగాణా సమైక్యతకు ముప్పు అని మాత్రమే వల్లెవేస్తారు.
అటు కాంగ్రెసు నాయకులు కూడా, ప్రత్యేక తెలంగాణా వల్ల ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు రాజకీయముప్పు ముంచుకొస్తుందనటంలోనూ అర్ధం లేదు। గత ఎన్నికల్లో 'సమైక్యాంధ్ర'తో పోరాడిన తెలుగుదేశం కోస్తాలో ఏపాటి సీట్లు గెలిచిందో అందరికీ తెలుసు. తెరాసతో ఎన్నికల సర్దుబాటు చేసుకొని, ప్రత్యేక తెలంగాణాకు తాము అనుకూలమని ఎన్నికల్లో పోరాడిన కాంగ్రెసు, అటు తెలంగాణాలోనూ, ఇటు కోస్తాలోనూ గెలిచిన విషయం విస్మరిస్తే ఎలా?
రెండో ఎస్సార్సీ వేయటమనేది కేవలమూ కాలయాపన చేయటానికే అనేది ప్రాథమిక రాజకీయాలు తెలిసిన ప్రతివాడు గ్రహించగలడు.
ఏదేమైనా, ఇలా అడ్డుగోలుగా వాదించే ప్రబుద్ధుల కన్నా కూడా, కె.సి.ఆర్., నరేంద్ర, వెంకటస్వామిలాంటి తెలంగాణా నేతలవల్లనే, ప్రత్యేక తెలంగాణాకు ముప్పు. చిత్తశుద్ధిలేని ఈ నేతల తెలంగాణా పూజ ప్రజలు అర్ధం చేసుకోకపోవటం తెలంగాణా దురదృష్టం. కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణాకు సంబంధించి ఏ ఒప్పందం ఉన్నదనేది ఈనాటికీ తెలంగాణా ప్రజలకు తెలియనీయకపొవటం వీరి నీచ రాజకీయాలకు పరాకాష్ట.
ఈరోజు తెలంగాణాకు కావల్సింది పొట్టి శ్రీరాములులాంటి నిస్వార్ధజీవి. సంకుచిత ప్రయోజనాలు ఆశించని, పదవీలాలసులుకాని నాయకులు అవసరం. పదవీలాలసతో ప్రత్యేక తెలంగాణాను పణంగా పెట్టిన రాజకీయ నాయకులను వదిలి ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వారు, ఉద్యమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళగలరా లేదా అన్నది శేషప్రశ్న.