Friday, February 22, 2008

తెలంగాణా - ప్రశ్నలకు జవాబులు

తెలంగాణాపై ఏమాత్రమూ అవగాహన లేకుండా ఈమధ్య 'తెలంగాణా ప్రశ్నలకు ప్రశ్నలు' అనే శీర్షికతో వచ్చిన ఓ ఆర్టికిల్ చదవటం తటస్థించింది। 'పేరు మాత్రమే గొప్ప' అన్న తరహాలో ఉన్న ఆ వ్యాసాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినా, ఆ వ్యాసకర్త కున్న కొన్ని దురభిప్రాయాలు, ఆయనకున్న అవగాహన చూసి నవ్వుకోవాల్సివచ్చింది.

ఎస్సార్సీ అంటే ఏమిటో కూడా తెలియదు ఆయనకు। ఎస్సార్సీ అనేది ఒక కమిటీ. అది కేవలమూ ఒక నివేదిక ద్వారా ప్రతిపాదనో లేదంటే రికమండేషనో చేయగలదు. కానీ, ఆయన మాత్రం అది తీర్పులిస్తుందంటారు!! అప్పట్లో మొదటి ఎస్సార్సీ ఇచ్చిన తీర్పు ఇప్పటి కాలమాన (వాతావరణం కూడా లిస్టులో పెట్టేసారు) పరిస్థితులకు పనికిరాదని కూడా ప్రకటించేసారు.

అయ్యా, ఏదో మేథావితనంతో వ్రాస్తున్నామనుకుంటూ, తెలంగాణాను వేళాకోళం చేస్తున్నారు। అది తప్పు. ఇంకా ఏవేవో అసంబద్ధమైన ప్రశ్నలైతే వ్రాసారు కానీ గుర్తులేవు. మళ్ళీ చూద్దామనుకుంటే, ఆయన మాత్రం ఆ వ్యాసానికి తాళం బిగించుకున్నారు. ఆయన సంగతి పక్కనపెట్టి, గతంలో 'ప్రత్యేక తెలంగాణా' శీర్షికన నేను వ్రాసిన ఓ వ్యాసంపై వచ్చిన కొన్ని అభిప్రాయాలకు వ్యాసం రూపంలోనే సమాధానం ఇస్తాను।

ఆ వ్యాసానికి స్పందిస్తూ, నా బ్లాగులో ఓ 'తెలుగు అభిమాని' 'మూడు ముక్కలు చేసుకుని నీళ్ళకోసం మూడు ప్రాంతాల తెలుగు వాళ్ళు కొట్టుకుంటుంటే బాగుంటుందా చెప్పు' అని అడిగారు। బానే ఉంది. కొట్టుకుంటే బాగోదని, మనం బాబ్లీ విషయంలో మహారాష్ట్రతోనూ, ఆల్మట్టి విషయంలో కర్ణాటకతోనూ గొడవపడకుండా ఆగామా? వాళ్ళూ మనలాగే భారతీయులేగా అని మిన్నకుండిపోలేదే మరి?

అంతకన్నా ఆశ్చర్యకరమైన, హాస్యాస్పదమైన వ్యాఖ్య శ్రీ తాడేపల్లి లలితాసుబ్రహ్మణ్యంగారు చేసారు। తెలంగాణాది సాంస్కృతిక సమస్యట!! ఆయన మాటల్లోనే చదవండి. "తెలంగాణా సమస్య సాంస్కృతికమైనది। ఆర్థికం కాదు. తెలంగాణాలో తెలుగు సంస్కృతి పూర్తిగా క్షీణదశకు తేబడింది. మిగతా తెలుగువారితో ఇక్కడి తెలుగువారు మమేకం కాలేకపోవడానికి ఇదే కారణం. This is a culturally impoverished region. అందువల్ల ఈ ప్రాంతం వెనకబడిపోయింది. ముందు సాంస్కృతికంగా బాగుచెయ్యడానికి పూనుకుంటేనే ఆర్థికంగా బాగుచెయ్యగలం."

ఇంకా నయం. తెలంగాణా సమస్య సాంస్కృతికమైనదే అన్నారు. అది తెలంగాణావారి 'మానసిక సమస్య'గా చెప్పనందుకు సంతోషించాలేమో!
ఇంకా 'గ్రంధాలయోద్యమాన్ని' అక్కడ చేపట్టాలని ఆయన సెలవించారు। ప్రజలు తెలుగుభాష నేర్చుకోటానికి, తెలుగులో ప్రభుత్వ వ్యవహారాలు సాగేందుకు వీలుగా మాడపాటి హనుమంతరావుగారి ఆధ్వర్యంలో 'గ్రంథాలయోద్యమం' మొదలయ్యింది తెలంగాణాలోనే అన్న విషయం బహుశా మీకు తెలిసుండదు.

అసలు తెలంగాణా ఉద్యమానికి ఉన్న చారిత్రక నేపథ్యం తెలియకుండా, తెలంగాణావాదాన్ని వేళాకోళం చేస్తూ ఈ కుహానా మేథావులు ఏం సాధిద్దామనుకుంటున్నారో అర్ధం కాదు। దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దాదాపు సంవత్సరానికి నిజాం నిరంకుశపాలన నుండి తెలంగాణా విముక్తమయ్యిందన్న విషయం వీరికి తెలుసా? స్వతంత్రభారతంలో పరాధీనగా మిగిలిన 'కోటి రతనాల వీణ' చేసిన 'సాయుధపోరాటం'లో అసువులు బాసిన అమరవీరులెందరన్నది వీరికి తెలుసా? 'నీ బాంచన్ దొర' అన్న బానిసలే, విప్లవాగ్నులై ప్రజ్వరిల్లి, ఉప్పెనగా పోటెత్తి నిజాం మెడలు వంచారన్న విషయం వీరికి తెలుసా?

ప్రత్యేక తెలంగాణా వాదంపై, పైత్య ప్రకోపాలు చేసే ఈ పెద్దమనుషులు అసలు తెలంగాణా కలిసి ఉంటే కలిగే లాభాలేమిటనేవి మాత్రం చెప్పరు। తెలంగాణా విడిపోతే కలిగే నష్టాలేమిటన్నది కూడా చెప్పరు. 'పెద్దమనుషుల' ఒప్పందం గురించేమైనా వీరికి తెలుసా? ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఊపందుకున్నప్పుడే, ప్రత్యేక రాయలసీమ, ప్రత్యేక కోస్తా విషయాలు ప్రస్తావించబడటంలోని రాజకీయాలు వీరికి అర్ధం కావా? చెప్పిందే చెప్పెరా.... అన్నట్లు, ప్రత్యేక తెలంగాణా సమైక్యతకు ముప్పు అని మాత్రమే వల్లెవేస్తారు.

అటు కాంగ్రెసు నాయకులు కూడా, ప్రత్యేక తెలంగాణా వల్ల ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు రాజకీయముప్పు ముంచుకొస్తుందనటంలోనూ అర్ధం లేదు। గత ఎన్నికల్లో 'సమైక్యాంధ్ర'తో పోరాడిన తెలుగుదేశం కోస్తాలో ఏపాటి సీట్లు గెలిచిందో అందరికీ తెలుసు. తెరాసతో ఎన్నికల సర్దుబాటు చేసుకొని, ప్రత్యేక తెలంగాణాకు తాము అనుకూలమని ఎన్నికల్లో పోరాడిన కాంగ్రెసు, అటు తెలంగాణాలోనూ, ఇటు కోస్తాలోనూ గెలిచిన విషయం విస్మరిస్తే ఎలా?

రెండో ఎస్సార్సీ వేయటమనేది కేవలమూ కాలయాపన చేయటానికే అనేది ప్రాథమిక రాజకీయాలు తెలిసిన ప్రతివాడు గ్రహించగలడు.
ఏదేమైనా, ఇలా అడ్డుగోలుగా వాదించే ప్రబుద్ధుల కన్నా కూడా, కె.సి.ఆర్., నరేంద్ర, వెంకటస్వామిలాంటి తెలంగాణా నేతలవల్లనే, ప్రత్యేక తెలంగాణాకు ముప్పు. చిత్తశుద్ధిలేని ఈ నేతల తెలంగాణా పూజ ప్రజలు అర్ధం చేసుకోకపోవటం తెలంగాణా దురదృష్టం. కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణాకు సంబంధించి ఏ ఒప్పందం ఉన్నదనేది ఈనాటికీ తెలంగాణా ప్రజలకు తెలియనీయకపొవటం వీరి నీచ రాజకీయాలకు పరాకాష్ట.
ఈరోజు తెలంగాణాకు కావల్సింది పొట్టి శ్రీరాములులాంటి నిస్వార్ధజీవి. సంకుచిత ప్రయోజనాలు ఆశించని, పదవీలాలసులుకాని నాయకులు అవసరం. పదవీలాలసతో ప్రత్యేక తెలంగాణాను పణంగా పెట్టిన రాజకీయ నాయకులను వదిలి ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వారు, ఉద్యమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళగలరా లేదా అన్నది శేషప్రశ్న.

Thursday, February 21, 2008

దాగుడుమూతలు

ఎప్పుడో మొదలైన ఆట ఇది
ఇప్పటికీ మారలేదు.

దాటిన గోడలు
దాగిన నీడలు
అన్వేషణలో ఇవి మామూలే

వైఫల్యం, వైరాగ్యం మధ్య
గెలుపు అనుమానాస్పదమైతే
ఆ పక్కనే మరో ఆశ

అలజడే అదృశ్యమైతే
కనుచూపు మేరా కాంతిపుంజాలే

Thursday, February 14, 2008

ప్రత్యేక తెలంగాణా

దాదాపు ప్రతి వార్తాపత్రికలోనూ, వెబ్ సైట్లలోనూ తెలంగాణా వాదనతో విద్వేషాలు పొడచూపుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అసలు తెలంగాణా ఎందుకు అవసరమనే విషయాన్ని రాజకీయపక్షాలు వదిలేసి, ఇతర విషయాల మీద యాగీ చేయటంతోనే సమస్య మొదలౌతున్నది. తెలంగాణాను వ్యతిరేకించే సమైక్యవాదుల వాదన కూడా ఇందుకు భిన్నంగా ఏమాత్రమూ లేదు.

సమైక్యవాదుల అభిప్రాయంలో, ప్రత్యేక తెలంగాణా అనేది దేశసమైక్యతను, ఆంధ్రుల ఐకమత్యాన్ని దెబ్బతీస్తుందనేది ముఖ్యమైనది. తెలంగాణా ప్రజలు ప్రత్యేక తెలంగాణా కోరుతున్నారే కానీ, 'ఖలిస్తాన్' తరహాలో ప్రత్యేక దేశాన్ని అడగటంలేదే!

అసలు ఉమ్మడి మద్రాసు నుండి ఆంధ్రప్రదేశ్ విడిపోవటానికి కూడా కారణం, ఆంద్రప్రాంతంపై మద్రాసు నేతలు చూపించిన వివక్షే అనేది చారిత్రక సత్యం. ఇప్పుడు అదే వివక్షతను కారణంగా చూపిస్తూ ప్రత్యేక తెలంగాణా కావాలని కోరుకోవటం తప్పేమిటి?

మొదటి ఎస్సార్సీ 1953లోనే, ఆంద్ర తెలంగాణాలు వేరువేరు రాష్ట్రాలుగా ఏర్పరచాలని ప్రతిపాదించింది.

'...It will be in the interest of Andhra as well as Telangana if, for the present, the Telangana area is constituted into a separate state, which may be known as Hyderabad State, with provision for its unification with Andhra after general elections likely to be held in or about 1961, if by two thirds majority the legislature of the residuary Hyderabad State expresses itself in favour of such unification.'
ఇంకా
'Andhra and Telangana have common interests and we hope these interests will tend to bring the people closer to each other. If, however, hope of the development of the environment and conditions congenial to the unification of the areas do not materialize and if public sentiment in Telangana crystalizes itself against the unification of the two states, Telangana will have to continue as a separate unit.'

కానీ ప్రజాభీష్టానికి, మొదటి ఎస్సార్సీ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా విశాలాంధ్ర ఏర్పడింది. నిజానికి అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కూడా తెలంగాణా - ఆంధ్ర ల సంయుక్తరాష్ట్రానికి వ్యతిరేకమే. విశాలాంధ్ర ప్రతిపాదనను ఆయన 'Tint of Expasionist Imperialism' అని కూడా అన్నారు.

విశాలాంధ్రలో తెలంగాణాకు మొండిచేయి చూపుతారనే ప్రజల అనుమానాల నివృత్తి కోసం 'పెద్దమనుషుల ఒప్పందం' చేసుకున్నారు. ఆ ఒప్పందంలోని ఏ అంశమూ ఇంతవరకూ అమలు చేయలేదు.

తెలంగాణాలో అభివృద్ధి జరిగిందంటూ సమైక్యవాదులు హైదరాబాదునే చూపిస్తారు కానీ, తెలంగాణాలో ఇతర జిల్లాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోరు. ఈనాటికీ, నల్గొండ, సూర్యాపేట ప్రజలకు తాగునీటి సమస్య తీరలేదు.

ఉదాహరణకు, ఆంద్ర రాయలసీమల్లో థర్మల్ విద్యుత్ ఉత్పాదన 7500 మెగావాట్లు. అదే తెలంగాణాలో 1600 మెగావాట్లు థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. విచిత్రమేమిటంటే, ఆంద్ర రాయలసీమలకు బొగ్గును సరఫరా చేసేది తెలంగాణా నుంచే. ఇక్కడ వనరులు దొరుకుతున్నప్పుడు ఇక్కడే అభివృద్ధి చేపట్టవచ్చు కదా!

ఆంద్రప్రదేశ్ అవతరించినప్పటి నుంచి 2001 దాకా దాదాపు 200 బిలియన్ రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఖర్చు పెడితే, తెలంగాణాలో కేవలం 40 బిలియన్ రూపాయలే ఖర్చు పెట్టారు.

ఇవి నేను వండి వడ్డించిన వివరాలు కాదు. 2001 సెన్సస్ ప్రకారం ప్రభుత్వ గెజెట్ లో ప్రకటించిన వివరాలు :

EDUCATION
Literacy Rate (as per 2001 Census)
Coastal Andhra – 63.58 %
Rayalaseema – 60.53 %
Telangana – 58.77 %
National Average - 65.38 %
=============
Enrolled School going children :
Coastal Andhra – 27,57,269 (45.50%)
Rayalaseema – 13,02,673 (21.49%)
Telangana – 20,00,452 (33.01%)
==============
No. of Teachers
Coastal Andhra – 64,314 (48.16%)
Rayalaseema – 28,434 (21.29%)
Telangana – 40,798 (30.55%)
================
Schools of Primary Education :
Coastal Andhra – 25,504 (45.62%)
Rayalaseema – 12,479 (22.32%)
Telangana – 17,918 (32.05%)

While noting the above details, keep in mind the Region-wise population percentage, which is as under :

Coastal Andhra – 41.69 %
Rayalaseema – 17.77 %
Telangana – 40.54 %

చిన్న రాష్ట్రాల వలన రాజకీయ అస్థిరత ఎక్కువౌతుందనేది మరో విమర్శ. పెద్ద దేశం మనది. ఇక్కడి కేంద్ర ప్రభుత్వమే అయిదు సంవత్సరాలు ఉంటుందనే గ్యారంటీ లేదు. ఇక అస్థిరత గురించి మాట్లాడటంలో అర్ధం లేదు. అలానే, గోవా జార్ఖండ్ ల మాదిరిగా చిన్న రాష్ట్రమేమీ కాదు తెలంగాణా.

ఏమైనా రాజకీయ నాయకుల సంకుచిత ప్రయోజనాల కోసం తెలంగాణా బలౌతున్నదనేది వాస్తవం. ప్రత్యేక రాష్ట్రమనేది ఒక రాజకీయ ప్రక్రియే. కానీ, ప్రజలు మార్పును కోరుతున్నారా లేదా అనేది ప్రజాభిప్రాయం ద్వారానే సాధ్యం. ఆ దిశగా ప్రభుత్వం అడుగులేయాలి. అంతేకానీ, ప్రణబ్ ముఖర్జీలు, రఘువంశప్రసాద్ యాదవ్ లు, సోనియా గాంధీల దయాభిక్ష కోసం తెలంగాణా ప్రజలు ప్రాకులాడేలా చేయటం సమంజసం కాదు.

Wednesday, February 13, 2008

అమరగాయకునికి అక్షరాంజలి

ముద్దబంతి పూవులో...
నీవేనా నను పిలచినది...
శివశంకరి... శివానందలహరి...
మనసున మనసై, బ్రతుకున బ్రతుకై...
దేవదేవ ధవళాచల...
ఘనాఘన సుందరా...
కుడిఎడమైతే...
జేబులో బొమ్మ...
తెలుగువీర లేవరా...
రాజశేఖరా నీపై...
కనుపాప కరువైన...

పాడాలని పాడేసిన పాటలు కావివి. ఒక్కో పాట ఆణిముత్యమనటంలో నేను కొత్తగా చెప్పేదేమీ లేదు. సినిమా చూసినా చూడకపోయినా, ఆయన పాటలు వింటే చాలు, సినిమా చూసినట్లే అంటే అతిశయోక్తి కాదు. కవి వ్రాసిన కవిత్వాన్ని గొంతుతో చిత్రంగా ఆవిష్కరించగలిగిన నేర్పరి. అందుకే ఆయన, ఆయన గాత్రం అజరామరం.

చాలామంది గాయనీగాయకులకు వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం గా కొన్ని అవకాశాలొస్తాయి. అవి పాడి చరిత్రలో నిలిచిపోతారు. కానీ, పాడిన ప్రతిపాటని లైఫ్ టైం అవకాశంలా మలుచుకుని, పాటలని అవి వ్రాసిన కవులను చిరంజీవులుగా చేసిన ఘంటసాల అపరబ్రహ్మ.

For Complete Article click :http://www.aavakaaya.com/showArticle.aspx?a=li&articleId=395&pageNo=0

Tuesday, February 12, 2008

నీతిలేని తెలంగాణా నేతలు

ఛీత్కారాలు, చీదరింపులు పట్టించుకోని జాతి మన ఆంద్ర కాంగ్రెస్ నాయకజాతి. అధినేత్రి ఆదరించకున్నా ఏమీ అనుకోము. అధినేత్రి అదిలించినా ఆహో ఓహో అనేస్తాం. పదవిని ముష్టిగా పడేస్తుందని దేబిరించుకుంటూ అధినేత్రి అడుగులకు మడుగులొత్తటానికైనా సిద్ధం!

Who is Veerappa Moili? Who is Pranab Mukherji? And who the hell is Sonia Gandhi to decide on తెలంగాణ? అడుక్కుతెచ్చుకోవాల్సిన పరిస్థితా తెలంగాణా రాష్ట్రానిది? ఎన్నుకున్న ప్రజలు ఈ నేతలకందించిన గౌరవాన్ని కాంగ్రెస్ అధినేత్రికి తాకట్టు పెట్టిన కాంగ్రెస్ నాయకులను ఏమనాలి? అంతకు మునుపు ఈ ఛీత్కారసత్కారానికి నోచుకున్నవారే తె.రా.స. నాయకమ్మణ్యులు కూడా.

నీతిలేని నేతలు తెలంగాణాను భుజాలకెత్తుకొని, దేశరాజధానిలో అవమానించిన తీరు తెలంగాణాకు, తెలుగువారికి లజ్జాకరమైన విషయం. ఈ నేతలను కలవడానికే ఇచ్ఛగించని అధినేత్రి, తెలంగాణా ఇస్తుందనే భ్రమలు ఇప్పటికైనా వీరికి దూరమై ఉండాలి.

పరిస్థితి తద్భిన్నంగా ఉంది. చేవ చచ్చిన ఈ నేతలు తెలంగాణా ప్రజలకింకా ఆశలు చూపిస్తూనే ఉన్నారు. మూకుమ్మడిగా ఈ నేతలందరూ రాజీనామాలు చేస్తే, మూలవిరాట్టు కదలిరాదా? ఇంకా ఏం ఉద్ధరించటానికి వీరు పదవులు పట్టుకు వ్రేలాడుతున్నారో ప్రజలకు వీరు చెప్పితీరాలి.

ఒక్క పార్టీతో తెలంగాణ రాదట.
తెలంగాణాకు భా.జ.పా., తె.దే.పా.లే అడ్డంకట.

తాగుడుమైకంలో వీరప్ప వేసే పిల్లిమొగ్గలివి. అంతకు ముందు, రెండో ఎస్సార్సీ తప్పదన్న పెద్దమనిషి ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యానాలేమైనా అర్ధం పర్ధం ఉన్నవేనా?కాంగ్రెస్ తప్ప, ప్రతి పార్టీ తెలంగాణ పై తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించాయి. చాలావరకు పార్టీలు దాదాపుగా ఒప్పుకునే పరిస్థితే. అయినా, ఏకాభిప్రాయసాధన అనటంలో ఉద్దేశ్యమేమిటి? ఇంతవరకూ కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని ఎందుకు బయటపెట్టటంలేదు. ఇండియా గురించే ఏమీ తెలియని సోనియా, తెలంగాణ గురించి ఏం నిర్ణయించగలదు?

ప్రజాస్వామ్యంలో మెజారిటీ అభిప్రాయానికే విలువ అన్న విషయం తెలియని వాజమ్మలా, ఏకాభిప్రాయ సాధన అనే నెపంతో తెలంగాణాను తొక్కేస్తున్నది? సిగ్గులేని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఇంకా ఏం ఉద్ధరించాలని పదవులు పట్టుకొని ప్రాకులాడుతున్నారో అర్ధంకాదు.

Tuesday, February 5, 2008

చిన్నచిన్న సంగతులు

1.
కాకి కబుర్లు వింటూ
నిద్రపోయింది
చెట్టు
మధ్యాహ్నం ఎండలో

2.
పిచ్చుకల కిచకిచలు
కప్పల బెకబెకలు
కొలువుదీరినట్లుంది
కొబ్బరి చెట్టు

3.
అల్లిబిల్లి తిరుగుతూనే ఉంది
చందమామ
నాకైతే
కళ్ళు తిరుగుతున్నాయి

4.
తలకిందులుగా
తపసు చేస్తూ
చూరు మీది చినుకు

5.
ఒక్క కుంచెలో
ఎన్నేసి రంగులో
వానలోఊరంతా కొత్తగా


6.
మబ్బుకవి
వ్రాసిన పాతపాటే
ఎప్పుడు విన్నాకొత్తగా

7.
ప్రతి అడుగూ
ఒక మడుగు
మబ్బులు
నడిచే వెళ్ళాయనుకుంటా

8.
పోగేసుకున్న గాలి
పారేసుకుంది కాబోలు
పచార్లు చేస్తుంటే
పలకరించే చెట్టు
మౌనంగా ఉంది ఈరోజు

9.
మంచుబిందువులా నిశ్శబ్దం
ఒలికిపోతుంటే
ఒడిసిపట్టుకుంటూ
నేల నవ్విన అలికిడి
తెల్లవారుతున్నది కాబోలు!

10.
నవ్వుకుంటూ
వెళ్ళింది చీకటి
పొగడపూలు
ఏరుకొద్దామా?

11.
అంత ఐసు ఇంతైనా
అదే తన్మయత్వం
పాప కళ్ళల్లో

12.
అమ్మను కరుచుకున్న
పాపాయిల్లా
బోర్ల బజ్జున్నపారిజాతాలు

13.
అటు వెళ్ళిన చెట్లే
ఎదురొస్తున్నాయి
రైల్లోఇంటికి వెళుతుంటే

14.
ఇల్లంతా నిశ్శబ్దం
ముసుగుతన్నిపడుకున్నట్లుంది
ఇంట్లో సందడి

15.
అటూ ఇటూ జనం
దూరలేక
ఆగింది గాలి
లోకల్ ట్రైనులో

Saturday, February 2, 2008

అమావాశ్య

రంగులు మారుతున్న
సాయంత్రం
రాత్రిలా మారింది.

అర్ధం కాకున్నా
వదిలించుకోలేని ఆశలు
నక్షత్రాలన్ని

ముగింపు ముందే తెలిస్తే
ఏ ఏ మార్పులుండేవో!

రాత్రికి రాత్రి
చీకటిలో కలిసిపోయా.

Friday, February 1, 2008

నా కోసం ఆగిన రాత్రి

సెలయేటి నుంచి
నన్నే పిలుస్తూ
నిన్నటి జ్ఞాపకంలా
రాలిన నక్షత్రం

దోసిట్లో ఆగని నిజం
తెరలు తెరలుగా నవ్వుతూ
గలగలా నవ్వుతూ
చందమామలా

పరిభ్రమించే జ్ఞాపకాల మధ్య
నా కోసం ఆగిన రాత్రి