Saturday, November 29, 2008

సిగ్గులేని ప్రభుత్వాలు

వాడి పేరు జకీరుల్లా. వయస్సు పాతికేళ్ళు. ముంబాయిలో మూడు రోజుల పాటు అల్లకల్లోలం సృష్టించిన తీవ్రవాదుల్లో వీడు కూడా ఒకడు. ఎ.టి.ఎస్.కు చెందిన ముగ్గురు సీనియర్ ఐ.పి.ఎస్. అధికారులనే కాకుండా, మరో 10-15 మంది అమాయక ప్రజలను మొన్న (26 నవంబరు 2008 రాత్రి) కాల్చి చంపిన తీవ్రవాది. ప్రస్తుతం క్రైం బ్రాంచ్ కస్టడీలో ఉన్నాడు. గాయపడ్డ వాడికి ఇబ్బంది లేకుండా, ముందుగానే ఆసుపత్రిలో చికిత్స చేయించారు కూడా. ఇకపైన సాగే తతంగాన్ని ఊహించటం కష్టమేం కాదు.

వీడు చేసిన ఘాతుకంతో ఇప్పుడు వీడో వి.ఐ.పి. మానవతా దృక్ఫధంతో రేపు వీడి తరుఫున ఓ జెఠ్మలానీనో మరో జిలానీనో కోర్టులో కేసు వాదిస్తామంటూ వస్తారు. ఓ అయిదారేళ్ళపాటు వాయిదాల మీద వాయిదాలు పొందుతారు. మధ్యమధ్యలో పోలీసులు వీడిని ఎంత హింసిస్తున్నారో వివరిస్తూ, ప్రభుత్వానికి తాఖీదులు కూడా పంపుతారు మానవహక్కుల సంఘం వారు. వీళ్ళకి సైదోడుగా నిలుస్తారు కుహానా లౌకికవాదులు. వీడికి అఫ్జల్ గురు టైపులోనో, అబు సలేం టైపులోనో ఫైవ్ స్టార్ ట్రీట్మెంటు ఇవ్వాలని డిమండు చేస్తారు, ఇప్పిస్తారు కూడా. వీలైతే, జైలు నుంచే వీడిని ఎన్నికల్లో నిలబెట్టటానికి సిద్ధమని సమాజ్ వాదినో మరో పార్టీనో సంసిద్ధత వ్యక్తం చేస్తుంది. ఈలోపు సుప్రీం కోర్టు వాడికి ఉరిశిక్ష విధించినా, అది అమలు చేస్తే మైనారిటీలు ఫీలవుతారని ప్రభుత్వాలు తాత్సారం చేస్తాయి. వీడిని ఈలోపు విడిపించుకోటానికి మరో టెర్రర్ ఎటాక్ మొదలయ్యి, ఈ ముఫ్తీ మహమ్మద్ సయీద్ కూతురినో, మనుమరాలినో కిడ్నాప్ చేస్తారు. చివరికి వీడు విడుదలౌతాడు.

పనికిరాని దద్దమ్మలు నడుపుతున్న ప్రభుత్వంలో ఇంతకుమించి న్యాయం జరుగదు. ఒక్కసారి వీడిని ముంబాయి ప్రజలకు అప్పగించి చూడండి. గుడ్లు పీకి, నాలుక కోసి, వేళ్ళు విరిచి, పోలీసులు కూడా ఊహించలేని విధంగా చిత్రహింసలు చేయకపోతే, ఒట్టు. మరి ఈ ప్రజలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు తిరగబడరు? చట్టాన్ని గౌరవించే ప్రజలు చెత్తవెధవలు కూర్చున్న చట్టసభలను ఎందుకు ఇంకా గౌరవిస్తున్నారు? సమాధానం చెప్పటం కష్టం.

సరే, ఈ సంగతి కాసేపు పక్కనబెట్టి దరిద్రపుగొట్టు హోం మినిస్టర్ వేసిన వేషాలు ఓసారి మననం చేసుకుందాం. తీవ్రవాదులు ఘాతుకానికి పాల్పడుతారని తెలుసుట. కానీ, ఎక్కడో, ఎప్పుడో, ఎలానో తెలియదు కాబట్టి ఏం చేయలేకపోతున్నదిట ప్రభుత్వం. ఒరేయ్ మంత్రి, ఎవడు ఎలా ఎప్పుడు నిన్ను చంపుతాడో తెలియదనే కదరా, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నావు. మరి సామాన్యప్రజలకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఎందుకు కల్పించలేవు. అయినా, తింగిరి వెధవ!! ఏ దొంగైనా ముందుగా చెప్పి మరీ వస్తాడురా? ఆమాత్రం ఇంగిత జ్ణానం కూడా లేకుండా టీవిల ముందు వాగేయటమేనా. నీకున్న ఆ దురద కూడా ఇప్పుడు తీవ్రవాదులు తీరుస్తారు. మొన్నటిదాకా, బాంబులు పెట్టి దాక్కునేవారు. ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రభుత్వాన్నే ధిక్కరిస్తూ, మూడురోజులపాటు మహానగరంలోని ఓ ఏరియానే చేతుల్లో తీసుకున్నారు. రేపు నువ్వన్నట్లుగానే, ఎక్కడ, ఎప్పుడు, ఎలా దాడి చేస్తారో చెప్పిమరీ చేస్తారు. అప్పుడేం పీకుతావో చూడాలని ఉంది.

అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అని.. హోం మినిస్టర్ పైత్యానికి ప్రధాని పైత్యం కూడా! అయ్యా తమరేదో మేథావిగా భావించేవాళ్ళం ఇప్పటి దాకా. ఈ తీవ్రవాదుల దాడి తర్వాత తమరు చేసిన ప్రసంగం విని మొహాన ఉమ్మేద్దామన్న కసి పుట్టింది - నాలాంటి సామాన్యుడికి కూడా. ఈ తీవ్రవాదుల ఘాతుకానికి వెనుక పాకిస్తాన్ ఉన్నదని చెప్పటానికి మాకు ప్రధానమంత్రి అక్కరలేదు. గత అయిదేళ్ళుగా, అంతకుముందు ఓ యాభై ఏళ్ళు దేశాన్ని పరిపాలించిన మీ కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ నిర్వాకాలని చూస్తూ మిన్నకుండి పోయింది ఎందుకు. పిల్లి పిత్తినా, పాకిస్తానే కారణమనటానికి సిగ్గులేదు మీకు. సరిహద్దులు బార్లా తెరిచిపెట్టి, పాకిస్తానే కారణమనటం ముదురుతున్న పైత్యానికి నిదర్శనం.

2006లో ఇదే ముంబాయిలో లోకల్ ట్రైన్లలో బాంబులు పేల్చి కొన్ని వందలమందిని చంపినప్పుడు ఈ ప్రధాని చేసిన వాగ్దానం నాకింకా గుర్తే. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదాలతో నలిపేస్తామన్నాడు. ఆ తర్వాత తీరిగ్గా 'పోటా' చట్టాన్ని పీకి పారేసాడు. వీడా, తీవ్రవాదాన్ని నిర్మూలించేది?

అసలు ఆ మాటకొస్తే, భారతదేశంలో తీవ్రవాదాన్ని పెంచి పోషించటంలో పాకిస్తాన్ కు సరిసమానమైన పాత్రను పోషించింది మన ప్రభుత్వాలే. భింద్రన్ వాలేను పంజాబులో పెంచిపోషించింది ఎవరో అందరికీ తెలిసిందే. అఫ్జల్ గురుకు సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించినా, ఇంతవరకూ అమలు చేయకుండా ఉండటం తీవ్రవాదానికి ఊతమివ్వటం కాదా? ఎవడో మంత్రి కూతుర్ని కిడ్నాప్ చేసి, తీవ్రవాదుల్ని విడుదల చేయించుకోవటం తీవ్రవాదానికి ఊతమివ్వటం కాదా? కాందహార్ లో తీవ్రవాదుల అడుగులకుమడుగులొత్తటం తీవ్రవాదానికి ఊతమివ్వటం కాదా?

వెన్నెముకలేని వెధవలు హోం మినిస్టర్లగాను, ప్రైం మినిస్టర్లగాను దేశాన్ని పరిపాలించటం మనదేశంలోనే సాధ్యం. వీరి పాలనలో క్షేమంగా ఉండగలమనుకోవటం అత్యాసే. ఉన్మాదుల దుశ్చర్యలకు సాక్షులుగా ఉన్న కొందరు చెప్పిన విషయాలు విన్న తర్వాత, ముంబాయిలోని మారణకాండ చూసి కళ్ళెర్ర జేయనివాడు గాంధీ అంతటి మహానుభావుడైనా అయ్యుండాలి, లేదంటే మన్మోహన్ లాంటి మోపివెధవైనా అయ్యుండాలి.

రెండేళ్ళ పాపను చంకన వేసుకుని ఆక్రందిస్తూ పరుగిడుతున్న ఓ తల్లిని, అటు తిరిగిఉన్న తీవ్రవాది ఇటు తిరిగి మరీ కాల్చి చంపాడట. ఆపైన కిందపడి ఏడుస్తున్న ఆ రెండేళ్ళ పాపను కూడా ఏమాత్రమూ దయలేకుండా కాల్చి నింపాదిగా నడుచుకుంటు పోయాడట! ఎవరు వీళ్ళకి ఈ ధైర్యాన్ని కల్పించారు? పాకిస్తానా లేక మన విధానాలా?

ఒక్క రాజకీయ నాయకుడు తప్పించి, బీదవాడైనా, మధ్యతరగతివాడైనా, ధనవంతుడైనా బతికి బట్టకట్టలేని పరిస్థితి మనదేశంలో ఉంది. దాదాపు అయిదు వందల మంది దేశప్రజలను, పదిహేను మంది పోలీసు అధికారులను, మరో ఇద్దరు కమెండోలను కోల్పోయి మనం సాధించింది ఓ పది మంది తీవ్రవాదులని చంపేయటం! దుశ్చర్య జరిగిన మర్నాడే, ప్రజలు తమ సాథారణ జీవితాన్ని కొనసాగిస్తూ ప్రదర్శించిన ధైర్యాన్ని మెచ్చుకుంటే ఉప్పొంగిపోతాం. నరనరాల్లో దేశభక్తి జీర్ణించుకుపోయిందని సంబరపడతాం. కానీ, ఇటువంటి దుశ్చర్యలు ఎందుకు జరుగుతున్నాయి? వాటికి ప్రభుత్వవిధానాలు దన్నుగా ఎందుకు నిలుస్తున్నాయని ఎవ్వరం ప్రశ్నించం.

చచ్చిపోయిన జనాల కోసం శాంతియాత్రలు చేస్తాం. వీరమరణం పొందిన పోలీసు అధికారులకి నివాళులర్పిస్తాం. అవార్డులు కూడా ఇస్తాం. కానీ, వారి మరణానికి కారణమైన ప్రభుత్వాన్ని మాత్రం నిలదీయం.

నిజానికి, దుశ్చర్య జరిగిన మర్నాడు ఉదయం అంటే, 27 డిసెంబరు 2008్ ఉదయం మా లోకల్ ట్రైను దాదాపు 70% ఖాళీగా ఉంది. అదే పరిస్థితి ఆ మర్నాడు కూడా.

అమెరికాలో 9/11 తర్వాత ఎటువంటి తీవ్రవాద దుర్ఘటన జరుగలేదు. కానీ మనదేశంలో ఇలా ఇంకెంతమంది చచ్చిపోతే, మన ప్రభుత్వాలు కళ్ళు తెరుస్తాయో?

హైద్రాబాద్, జైపూర్, అహ్మదాబాద్, ఢిల్లీ, గౌహతి, ముంబాయ్, అలహాబాద్, వారణాసి, బెంగుళూర్ .. ఇంకెన్ని?