Showing posts with label ఏదో చెప్పాలనీ .... Show all posts
Showing posts with label ఏదో చెప్పాలనీ .... Show all posts

Wednesday, June 2, 2010

'ఈనాడు'లో నా అనుభవాలు


"ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు" చదువుతుంటే, నేను తిరుపతి ఈనాడులో పనిచేసిన రోజులు గుర్తుకువచ్చేవి. 88 చివర్లో తిరుపతి ఈనాడులో పి.ఎల్.ఎం.ఓ.గా (కంపోజింగ్ సెక్షన్) చేరాను. పదోతరగతి సెలవల నుంచి, గుమాస్తాగిరికి ఉపయోగపడుతుందనుకునే మధ్యతరగతి మనస్తత్వంలో భాగంగా, ఇంగ్లీషు, తెలుగు, హింది టైపు రైటింగు, షార్ట్ హాండు నేర్చుకోవటం మొదలేసా. డిగ్రీ అయిపొయిందే తడవుగా ఈనాడులో ఉద్యోగం రావటంతో మరేమీ ఆలోచించకుండా జాయిన్ ఐపోయాను. నిజానికి, కాలక్రమంలో ఓ జర్నలిస్టుగా స్థిరపడదామనే ఆలోచన కూడా ఈనాడులో చేరటానికి మరో ముఖ్య కారణం. రెండు సార్లు ఈనాడులో సబ్ ఎడిటర్ ఉద్యోగానికి గాను, వ్రాత పరీక్షలకు కూడా హాజరయ్యాను. అదృష్టం కొద్దీ పాస్ కాలేదు :)

నేను పని చేసిన దాదాపు ఏడెనిమిది నెలల్లో, ఈనాడులో నాకు నచ్చిన ఓ మంచి విషయం ఏదైనా ఉన్నదంటే, అది జీతం. బెత్తెడు జీతమే (స్టైఫండ్) అయినా ఠంచనుగా నెలాఖరుకల్లా వచ్చేది. ఆ రోజుల్లో, మా రూం మేట్లుగా ఉన్న ఆంధ్రజ్యోతి, ఉదయం పత్రికల ఉద్యోగులు మాత్రం నానా బాధలు పడేవారు జీతం సమయానికి రాక. బచావత్ ట్రిబ్యునల్ సిఫార్సుల ఆధారంగా జీతాలు ఇవ్వాళ పెరుగుతాయి, రేపు పెరుగుతాయి అనుకుంటూనే, దాదాపు ఓ అయిదేళ్ళు గడిచిపోయాక గానీ, ఈనాడులో జీతాలు పెరగలేదని చెప్పేవారు, ఆ తర్వాత నా జర్నలిస్టు స్నేహితులు.

జర్నలిస్టులు ఎలా పీడింపబడేవారో నాకైతే తెలియదు కానీ, మమ్మల్ని మాత్రం సబ్ ఎడిటర్లు పీల్చి పిప్పి చేసేవారు. అలానే, సీనియర్లు కూడా చెండుకు తినేవారు. కొత్తగా వచ్చామని మాకు డే షిఫ్టు ఉండేది, కంప్యూటర్ లో తెలుగు టైపు చేయటం నేర్చుకోటానికి వీలుగా. ఎందుకంటే, డే షిఫ్టులో ఎక్కువ పని కూడా ఉండేది కాదు, కాబట్టి ఆ సమయంలో మాకు మా షిఫ్టు ఇన్ ఛార్జి టైపు చేయటం, అలానే, ప్రకటనలు చేయటం నేర్పేవాడు. కానీ, చేరిన కొత్తలో ఓ రెండు వారాలు మినహా, మళ్ళీ ఏనాడు ఆ షిఫ్టులో పని చేయలేదు. సీనియర్లు అడ్జస్టుమెంట్లని వేధించేవారు. కుదరదంటే వాళ్ళ చాకిరి కూడా మా మీద రుద్దేవారు. మా షిఫ్టు ఇన్ ఛార్జి మాత్రం చాలా మంచివాడు. నాకు వ్యక్తిగతంగా కూడా సహాయం చేసేవాడు. అతని పేరు తాతబ్బాయి. తిరుపతికి కొత్త కావటంతో, మాకు అద్దె గది వెతుక్కోటంలో, వీక్లీ ఆఫ్ రోజు ఇంటికి పిలిచి మంచి భోజనం పెట్టటం చేసేవాడు. అలానే, ఓవర్ టైం చేయించి, కంపెన్సేటరీ సెలవలు కూడా ఇచ్చేవాడు. రెండో షిఫ్టు ఇన్ ఛార్జి (భీమారావు) అంటే అప్పట్లో ఎందుకో టెర్రర్ గా ఉండేది. మనిషి మాట తీరే కఠినంగా ఉంటుంది కానీ, మంచివాడే అని ఆ తర్వాత తెలిసింది.

ఇక ఈ సబ్ ఎడిటర్లు... ఈనాడులో సబ్ ఎడిటర్ అనేప్పటికి ఏవో కొమ్ములు మొలిచినట్లు, కంపోజింగ్ సెక్షనులో ఉన్న మేమేదో పనికిమాలినవాళ్ళమైనట్లు చూసేవారు. వారు వ్రాసి ఇచ్చే వార్తలు, నిజం చెప్పాలంటే నవ్వొచ్చేది. ఏదో వ్రాసుకుపోవటమే కానీ, స్పార్క్ ఏకోశానా కనిపించేవిధంగా ఉండేవి కాదు. స్థానిక వార్తలకు ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశ్యంతో మొదలైన జిల్లా ఎడిషనుల వల్ల, వార్తలలో పస తగ్గిపోయిందేమో అనిపించేది. మడకశిరలో మడత మంచాల పంపిణీ,.. అనంతపురంలో ఆత్మహత్య... కుళాయి తగాదాలో కన్నుమూత... ఇలా సాగేవి వార్తల శీర్షికలు. ఇక వీళ్ళ చేతివ్రాత చూస్తే కళ్ళు బైర్లు కమ్మేవి. ఎవరో ఒకరిద్దరు తప్ప, మరెవరి చేతివ్రాత అర్ధమయ్యేది కాదు. నమ్మండి, నమ్మకపోండి... నేను, రమణ బాబు అనే మరోతను కలిసి నాలుగు జిల్లా ఎడిషన్లు పూర్తిగా కంపోజ్ చేసేవాళ్ళం, పోటీ పడి మరీ. ఇక మమ్మల్ని రెచ్చగొడుతూ, సీనియర్లు వాళ్ళ పని కూడా మాకు పురమాయించేవాళ్ళు.

వ్యక్తిగతంగా, నేను నైట్ షిఫ్టు కోరుకునేవాడిని. ఎందుకంటే, ఆ సమయంలో సబ్ ఎడిటర్లతో కూర్చొని నేను కూడా వార్తలు వ్రాసే అవకాశం దొరికేది. అప్పట్లో విశ్వప్రసాద్ గారు చిత్తూరు డెస్కు ఇన్ ఛార్జిగా ఉండేవారు. వాళ్ళ డెస్కుకు పని తగ్గుతుందనేమో తెలియదు కానీ, ఆయన చాలా ప్రోత్సహించేవారు. అప్పటి ఓ విషయం నాకింకా గుర్తే. గాలి ముద్దుకృష్ణమ నాయుడు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి, కొన్నిపనులు ఎందుకు చేయలేకపోతున్నది (దాదాపుగా ఇదే అర్ధంలో) వివరణ ఇచ్చారు. రిపోర్టరు ఇచ్చిన ఆ వార్తకు "ముద్దు" మాటలు "గాలి"కే అనే శీర్షిక పెట్టి ఆ వార్తను ఎడిట్ చేసా. విశ్వప్రసాదుగారు నవ్వి, ఆ శీర్షిక తీసి, ఇంకోటి పెట్టారు.

మమ్మల్ని వేధించిన వాళ్ళలో మరో ముఖ్య వ్యక్తి అక్కడి పర్సనల్ మేనేజర్. పేరు సరిగా గుర్తులేదు... రాజేంద్రబాబు అనుకుంటా. కంప్యూటర్ సెక్షనులో ఏ.సి. ఉండేది. దాదాపు ఎనిమిది గంటలు కూర్చోవాలంటే ఇబ్బందిపడేవళ్ళం. మధ్యలో ఓ పది నిముషాలు బ్రేక్ తీసుకొని బయట జేబులో చేతులు పెట్టుకు నుంచుంటే... "ఏరా, జేబులో చేతులు పెట్టి XXXX పిసుక్కుంటున్నారు... ఇలాగైతే ప్రొబేషన్ పెంచేస్తా..." అని అరిచేవాడు. సగం ఈయన కూడా కారణమే, నేను ఈనాడు వదిలేసి వెళ్ళిపోటానికి. ఇక ఆ మేనేజరు... గోవిందరావో, గోపాలరావో ఉత్సవవిగ్రహంలా మాత్రమే ఉండేవాడు. అసలు ఆయన చేసే పనేంటో మాకు అర్ధం అయ్యేది కాదు. అంతా రాజేంద్రబాబు హవానే నడిచేది.

ఇంత చెప్పీ, రెడ్డెమ్మ మెస్ గురించి చెప్పకపోతే ఎలా? చాలా చౌకగా భోజనం పెట్టేది. ఈనాడు ఆఫీసు నుంచి, రైల్వే లైను దాకా నడుచుకుంటూ వచ్చి లైనుకు అవతల ఉన్న రెడ్డెమ్మ మెస్ లో భోజనం చేసేవాళ్ళం. కానీ, నాలాంటి వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే, శాఖాహారం, మాంసాహారం రెండు వండేది. అంతా ఒకేచోట కూర్చొని తినాల్సి వచ్చేది. తాగుబోతు భర్తని, ఆకతాయి మొదటి భార్య పిల్లవాడిని భరిస్తూ, ఎలా పని చేయాల్సి వస్తున్నదో నసుగుతూ వడ్డించేది.

ఇక, తెల్లవారుఝామున మూడు గంటలకు బయలుదేరి, లారీలు ఆపుకుంటూ తిరుపతి చేరేవాడిని. వదిలేసే ముందు రేణిగుంటకు మకాం మార్చాను. కంపోజింగ్ సెక్షనులో అప్పటి నా మిత్రులు వాసుదేవ రావు, లక్ష్మణ రావు, రమణ బాబు, దుర్గా ప్రసాద్, మురళీమోహన రావు, నాయుడు, కృష్ణమూర్తి.... ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో!

ఆవకాయలో కూడా....

Friday, May 7, 2010

నావి కాలేని నీవి - నానీలు మరో సమాలోచనం

గతంలో "నానీ"ల పై నేను వ్రాసిన వ్యాసం.


ఎన్ని గజాలు వ్రాసావన్నది కాదు ముఖ్యం
ఎన్ని నిజాలు చెప్పావన్నది ముఖ్యం
నిన్నటి మహాకావ్యం పద్దెనిమిది పర్వాలైతే
నేటి మహాకావ్యం పద్దెనిమిది పేజీలు.

ఏ సందర్భంలో ఆరుద్రగారు వ్రాసారో కానీ, నానీల పేరుతో ఈమధ్యకాలంలో విశృంఖలంగా వస్తున్న కవితలనబడే సాహిత్యాన్ని చూసినప్పుడల్లా గుర్తొచ్చే పంక్తులవి.

పద్దెనిమిది పేజీలేమో కానీ, పది లైనులు కూడా వ్రాయలేని ప్రబుద్ధులందరూ ఒక ఇమేజరీతో ఒక ప్రకటనతో నాలుగులైనులు గిలికేసి,  దాన్నే కవిత్వంగా సరిపుచ్చే ధోరణి ప్రబలిపోతున్నది.

అసలు హైకులు, మినీకవితలు వంటి ప్రక్రియలు ప్రత్యేకించి ఉండగా ఈ నానీలని తవ్వి తలకెత్తుకోవలసిన విశేషం ఏమైఉంటుందనేది ఈ విమర్శనాత్మక వ్యాసపు ప్రధానోద్దేశ్యం.

ఈ వ్యాసానికి ఉపకరించిన పుస్తకం నానీల ఏడవ వార్షికోత్సవం సందర్భంగా నానీల నాన్నగారి (ఈ వ్యాసంలో 'నా.నా. గారూ - ఎన్. గోపి గారు) తొలివారసుడుగా (ఈ వ్యాసంలో నా.వా.గారు) ఎస్. ఆర్.భల్లం గారు సంపుటీకరించిన వ్యాసాల, సమీక్షల,  జనవాక్యాల సమ్మేళనం 'నానీల సమాలోచనం'  అనే పుస్తకం.

"హైకూలు రాసే కవులు కూడా ఈ నానీని పోటీ కవితా ప్రక్రియగా భావించక, సహృదయతతో అక్కున చేర్చుకొన్నారు" అంటూ నా.వా.గారు వ్రాసిన సంపాదక వాక్యంలోనే నానీ ప్రక్రియకు దోహదంచేసిన కారణాలు అన్యాపదేశంగా ప్రకటీకృతమౌతున్నాయి.

"నానీల కవితా పరివ్యాప్తి" అనే వ్యాసంలో, నా.వా.గారు "హైకు రచన వేరు. నానీ నిర్మాణం వేరు! నానీ నిర్మాణానికి సామాజిక వాస్తవికత గొప్ప ఉత్ప్రేరకం" అంటారు.

అసలు "హైకు" అనేది అనుభవాన్ని అనుభవంగా ప్రకటించే కవితా ప్రక్రియ. అందులోనూ ముఖ్యంగా మార్మికత సంతరించుకున్న తాత్వికత హైకు ప్రక్రియకు జవజీవం. కానీ, ఈ రెంటికి మించి "సామాజికత" నానీలలో ముఖ్యమైన అంశం అని నా.వా.గారి ఉవాచ.

మూడు లైనుల్లో,  17 అక్షారాలలో చెప్పలేని సామాజిక వాస్తవాన్ని, నాలుగు లైనుల్లోను, 25 అక్షరాల నియతితో ఎలా చెప్పగలరని ఈయన ఉద్దేశం? ఇంత చెప్పిన ఈ పెద్దమనిషి తమకు తాము విధించుకున్న నియతిని ఖచ్చితంగా పాటించారా అంటే అదీలేదు. ఈ ఉదాహరణలు చూడండి.

వాడేంటి
ఇన్ని చక్కర్లు కొడుతున్నారు
అవును
వాడిది ఆషాఢభూతి అంశ (26 అక్షరాలు)

రైతుకీ
ధాన్యానికి బంధం తెగిపోయింది
మిల్లులో నలిగేవి
బతుకులు కూడా (27 అక్షరాలు)

మొదటి నానీలో ఏ సామాజికత దీన్ని కవిత్వం చేస్తున్నదో!! అలాగే, రెండో నానీ వార్తాపత్రికలో శీర్షికలా మాత్రమే నాకనిపిస్తున్నది కానీ, కవిత్వమైతే కనిపించటంలేదు.

ఏతావాతా తేలేదేమిటంటే, "సామాజికతను" క్లుప్తంగా కవిత్వంలో చొప్పించటానికి వీరికి ఓ నాలుగుకాళ్ళ వాహనం కావల్సివచ్చింది. దానికీ పాతిక అక్షరాల మెలికతో ఒక తోక.

ఈ పుస్తకంలోనే, డా. తలతోటి పృధ్వీరాజ్ గారు "నానీలు" అనే వ్యాసంలో యశశ్రీ రంగనాయకిగారు చెప్పినట్లుగా ఉటంకించిన వాక్యం చూడండి. "...యోగి వేమన పద్యాలు గన్ షాట్ లు అయితే, ఆ వేమన్న వాదం వినిపించిన గోపిగారి నానీలు పెన్ షాట్ లు".

అసలు విషయాన్ని చాలా చక్కగా వివరించారు ఆ ఒక్క వాక్యంతో. ఈటెల్లాంటి ఆటవెలది పద్యాలతో వేమన స్పృశించని ఏ సామాజిక కోణాన్ని ఈ "నానీ ప్రక్రియ" స్పృశిస్తున్నదో!

ఆ మాటకొస్తే, "ఓ కూనలమ్మా" అనే మకుటాన్ని మినహాయిస్తే, ఆరుద్ర గారు మూడు లైనుల్లో "నానీ"ల కన్నా అద్భుతంగా కూనలమ్మ పదాలు వినిపించారు మరి. నిన్నగాక మొన్న జనార్ధన మహర్షి వ్రాసిన "వెన్నముద్దలు" దాదాపు ఈ కోవలోవే. వీళ్ళెవరూ పనిగట్టుకొని, అవో ప్రత్యేక కవితా రీతిగా దరువులు వేసుకోలేదే!

"ఒక ఉద్వేగభరితమైన నిరంతర సంవేద మూలం" నానీల ఆవిర్భావానికి కారణంగా నా.నా.గారి వివరణ. హైకూలైనా, మినీకవితలైనా, ఆఖరికి విశ్వంభరలాంటి కావ్యాలైనా, ఒకానొక ఉద్వేగం నుంచి జనించినవే. ఆ విషయంలో చిన్నకవులు వ్రాసినా, చితక కవులు వ్రాసినా ఆయా రాతలలో "ఉద్వేగానికి" మినహాయింపు ఉండదు. కాబట్టి, ఆయన నానీల ఆవిర్భావానికి ఇచ్చిన ఈ వివరణ తేలికగా కొట్టిపారేయదగ్గదే.

అసలు హైకు అంటే ఏమిటి?

మూడు పాదాలు ఉంటాయి.
ఒకటి మూడు పాదాలలో అయిదేసి అక్షారాలుంటాయి.
రెండవ పాదంలో ఏడు అక్షరాలుంటాయి.
మొత్తానికి మూడు లైనులతో, పదిహేడు అక్షరాలతో జపనీస్ భాషలో జెన్ బౌద్ధం స్ఫూర్తితో వచ్చిన ప్రక్రియ హైకు.

మన తెలుగు భాషలో ఈ ప్రక్రియలో వ్రాయటంలోని సావకాశం తక్కువే. నాలుగు పాదాలలో అక్షర నియమాన్ని ఉల్లంఘిస్తూ వచ్చిన హైకులు విదేశీ భాషలలోనూ ఉన్నాయి.  కాని అర్ధంకాని విషయం ఏమిటంటే, నాలుగు పాదాలు, 25 అక్షరాల వెసులుబాటు కల్పించుకొని, తానేదో కొత్త ప్రక్రియ కనిపెట్టానన్న ఢమరుకపు మోతలెందుకో ఈ నా.నా. గారికి, వారి వారసులకి!!

రెంటికీ చెడ్డ రేవడిలా, అటు హైకులకి ఎక్కువ, ఇటు మినీ కవితలకి తక్కువగా అసంబద్ధంగా నానీ కవిత్వం ఉన్నదనేది నిష్ఠూరమైనా నిజం. చాలా వరకు నానీలు ఉపదేశాలకో, ప్రకటనలకో పరిమితమైపోయాయి.

పిల్లి గుడ్డిదైతే, ఎలుకేదో చేసిందని, తెలుగు సాహితీ విమర్శకులు నానీల విషయంలో మిన్నకుండిపోవటం వల్లనే, ఇప్పుడు నానోల పేరుతో నాలుగు పదాల చిల్లర కొట్టు కవిత్వం విశ్వవ్యాప్తం చేసే ధోరణి మొదలయ్యింది.

ఏదేమైనా, నా.నా.గారు, వారి వారసులు నానీ కవిత్వం విషయంలో, తవ్వి తలకెత్తుకోదగ్గ కొత్త కవితా విశేషమేమీ కనిపెట్టకుండానే డప్పు వాయించుకోవటం విపరీతం!!

నా అభిప్రాయంలో :

ఛందోబంధాలు వద్దు అనుకున్నప్పుడు, దాదాపు అటువంటివే అయిన సరళీకరించబడిన బంధాలు మాత్రం దేనికి? హైకులని చూసి వాత పెట్టుకున్న బంధాలే అవి అని స్పష్టంగా తెలుస్తున్నది.

మకుటం వదిలేస్తే, మూడు పాదాల్లో వేమన వ్రాసిన పద్యాలకు కూడా నానీలు నకలే.

హైకూలనే మరో వాక్యంతో విస్తరింపచేసి, అందులో సామాజికతే ముఖ్యమని మభ్యపెట్టిన పసలేని ప్రయోగమే నానీలు.

నిజానికి, నాలుకు లైనులు కూడా సరిగ్గ వ్రాయలేని ప్రబుద్ధులను కవులుగా చలామణి చేసి, ఆధునిక కవిత్వాన్ని నాలుగు లైనులకు దిగజార్చటంలో నానీల బాధ్యత చాలా వరకు ఉంది.

Wednesday, March 10, 2010

కామెడీ స్వాములు-బూతు బొమ్మలు

చిడతల కామెడీ స్వాముల వారు దేవతల నగ్న విగ్రహాల ఫొటోలను తమ బ్లాగులో ప్రదర్శనకు పెట్టారు. స్వామివారి ఉద్దేశ్యం "దేవతలను నగ్నంగా చిత్రించడం హిందు సాంప్రదాయం కాదంటున్న మూఢులకు జ్ఞానబోధ కాకపోయినా, మరికొందరు మూఢులుగా తయారు కాకుండ ఉండటానికి" ఈ ప్రదర్శన ఏర్పాటు చేసారు.

నిజానికి అయ్యవారి అసలు ఉద్దేశ్యం వేరు. హుస్సేన్ గాడు చేసింది తప్పు అనేవారు, హిందు సాంప్రదాయాన్ని కూడా తప్పు అనాలి. లేదా, అది హిందు సాంప్రదాయమే అనేట్లయితే, హుస్సేన్ గాడిని అక్కున చేర్చుకోవాలి, లాలించాలి, బుజ్జగించాలి. మానసిక పరిపక్వత లేని పరిస్థితుల్లో ఇటువంటి "చీప్ ట్రిక్సు"కు పాల్పడతారు ఈ దొంగ స్వాములు.

ఏతావాతా, కామెడీ స్వామి వారు తీర్మానించిన విషయం దేవతలని నగ్నంగా చిత్రించటం హిందు సాంప్రదాయం అని. అయ్యా, ఏ ఆగమ, వాస్తు శాస్త్రాల ప్రకారం దేవతా విగ్రహాలను, దేవాలయాల గోడలపై బొమ్మలను నగ్నంగా చిత్రించాలని ఉందో చెబితే సంతోషిస్తాం.

నాకు తెలిసీ, ఆయా కాలాలలోని సామాజిక పరిస్థితుల కనుగుణంగాను, ఆయా రాజుల, శిల్పకళాకారుల, ఆగమశాస్త్ర నిపుణుల ఆధ్యాత్మిక పరిణతికి అనుగుణంగాను, ఆయా దేవాలయాలను నిర్మించాలనుకున్న "థీం"కు అనుగుణంగాను అవి నిర్మించబడ్డాయి. నగ్న విగ్రహాలే ఉండి తీరలన్న సాంప్రదాయమనేది ఉండి ఉంటే, దేశంలోని అన్ని దేవాలయాలలోనూ ఇదే పరిస్థితి ఉండాలే!

అయోధ్యలోని రామ మందిరమే కాదు, దేశంలోని ఏ రాములవారి గుడి అయినా, హనుమంతులవారి గుడిలోనైనా, సీతారాముల, హనుమంతులవారి విగ్రహాలు నగ్నంగా ఉండవు. మరి హుస్సేన్ గాడు చిత్రించిన సీత, హనుమంతులవారి నగ్న చిత్రాలకు ఆధారం ఏమిటి? ఇక "లజ్జ గౌరి" లాంటి తీవ్ర దేవతలకు, మన ప్రాంతాలలోని గ్రామ దేవతలకు సంబంధించిన విషయాలు వేరు. అవి అర్ధం కావాలంటే, కొద్దిగానైనా మంత్ర, తంత్ర పరిజ్ఞానం అవసరం.

చెప్పొచ్చేదేమిటంటే, ఈ హుస్సేన్ గాడికి అంత సృజనశీలత ఏమీ లేదు. కేవలం హిందువుల మనోభావాలు గాయపరచటానికి, విదేశాలలో భారత పురాణేతిహాసాల దేవతల చిత్రాలు అమ్ముకోటానికి మాత్రమే నగ్నత్వం కావల్సి వచ్చింది. వాడి అమ్మనో, అయ్యనో, పెళ్ళాం పిల్లలనో నగ్నంగా చిత్రిస్తే కొనేవాడు ఎవడు?

ప్రజల మధ్య అగాధాలు సృష్టించే హుస్సేన్ గాడిలాంటివాళ్ళను అడ్డుకోకపోతే, అహంకారం తప్పించి అణుమాత్రమైనా ఆలోచన లేని కామెడీ మూఢ స్వాముల ఆసరాతో, రేపు మరో దావూద్ ఇబ్రహిం బయలుదేరతాడు. సుప్రభాతాలు, సహస్రనామాలు బూతు మయం, నేను వ్రాసే బూతు పాటలతో పూజలు చేసుకొమ్మంటాడు. అటువంటి ఉపద్రవాలు రాకుండా, ప్రజల మధ్య విద్వేషాలు పొడచూపకుండా ఉండాలంటే, దేశద్రోహులైన కేతిగాళ్ళకు ప్రభుత్వం పగ్గాలు వేయాలి.

Friday, March 5, 2010

"చివరకు మిగిలేది" - ఓ ఆక్రోశం


"చివరకు మిగిలేది" పురాణమూ కాదు, ఇతిహాసమూ కాదు. కాకమ్మ కథ, పిచ్చుకమ్మ కథ లాంటి బుచ్చిబాబు వ్రాసిన కథ. జీవితంలో ప్రేమించలేకపోవడమే ఒక విషాదంగా నమ్మి, దానికి తను నమ్మిన ఇతర తాత్వికచింతనలు జోడించి నలుగురితో తన బాధను పంచుకుందామని "బుచ్చిబాబు" చేసిన ప్రయత్నం "చివరికి మిగిలేది". 1952 లో జరిగిన మొదటి ముద్రణ నుంచి, 2006 వరకు జరిగిన ఆరవ ముద్రణ వరకు, యాభైనాలుగేళ్ళల్లో ఆరు ముద్రణలు పూర్తి చేసుకున్నదంటే నవల ఖచ్చితంగా క్లాసిక్కే. క్లాసిక్ కాకపోయినా, యాభై ఏళ్ళ తర్వాత కూడా పాఠకులు ఆదరిస్తున్నారు కాబట్టి, తెలుగు సాహిత్యంలో నవలకు, నవలకున్న అగ్రస్థాయికి వచ్చిన ఢోకా ఏమీలేదు.

విషయం పక్కనపెట్టి, స్థూలంగా "చివరికి మిగిలేది" ఒక కథలా మాత్రమే పరిగణించి పరికిస్తే, కథనంలో కవిత్వాత్మక వచనం, ఆత్మ సంశోధనా, సంవేదన భరితమైన కొన్ని రసవత్తర ఘట్టాలు తప్పించి, ఓ సామాన్యమైన కథే కనిపిస్తుంది. "కన్యాశుల్కం" లాంటి రచనలతో పోలిస్తే, అక్కడక్కడ స్త్రీస్వామ్య భావజాలాన్ని ప్రదర్శించటం తప్పించి, ప్రత్యేకించి ఎన్నదగ్గ సామాజిక విలువలు కూడా లేవు.

చెప్పుకోదగ్గంతగా లేని సామాజిక విలువల కారణంగా పుస్తకానికి పట్టం కట్టలేని పరిస్థితి ఒకవైపైతే, పేలవమైన కథ కారణంగా, కథనంలోని అద్భుతమైన సాహితీ విలువలకు పట్టం కట్టలేని దుస్థితి మరో వైపు. నా ఆక్రోశం కూడా అదే!

* * *

సామాజిక ధృక్కోణాలు మారుతున్నాయి. అలానే, సామాజిక, సాహితీ విలువలు కూడా మారుతున్నాయి. ఆలోచనా పరిధుల్లో కూడా చెప్పుకోదగ్గ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. నేపథ్యంలో గమనిస్తే, పుస్తకం.నెట్ లోని "హేలి" గారి సమీక్ష నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరమూ లేదు, నెత్తి నోరు బాదుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. "

శరత్ సాహిత్యంలో తలమానికమై భాసించే "దేవదాస్" కు పట్టిన దుర్గతితో పోలిస్తే, హేలీ గారి వ్యాసం పెద్ద లెక్కలోది కూడా కాదు. ఈ రోజుల్లో కొద్దిగా గడ్డం పెంచితే, అమ్మాయిగాని హాండిచ్చిందా, దేవదాసయ్యావని పరామర్శించే మిత్రులకు కొదవలేదు. ఆనాటి సామాజిక పరిస్థితుల్లో "దేవదాస్" ను ఆదరించి ఉండవచ్చు. పరిస్థితులు ప్రస్తుతమైతే లేవు.

అదేవిధంగా, తెలుగులో అభ్యుదయ రచనలకు ఆద్యుడుగా గురజాడ అప్పారావుగారికి ఉన్న గౌరవం మరెవ్వరికీ లేదు. కానీ, ఆరోజుల్లో ఆయన వ్రాసినట్లుగా "దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టిమాటలు కట్టి పెట్టి, గట్టి మేల్ తలపెట్టవోయ్" అని ఈరోజుల్లో వ్రాస్తే, సందేశాలాపి కవిత్వం చూపించమంటారు నేటితరం కవులు, విమర్శకులు.

మారుతున్న సామాజిక ధోరణికి అనుగుణంగా ప్రజలూ మారుతున్నారు. మారుతున్న ప్రజల ప్రామాణికాల కనుగుణంగా, ఆయా రచనలను బేరీజు వేస్తున్నారు. పురాణేతిహాసాలకే దిక్కులేని పరిస్థితుల్లో, అటువంటి సమీక్షలకు, విమర్శలకు ఆక్రోశించాల్సిన అవసరం లేదు.

* * *

పుస్తకంలోని పాత్రలు కల్పితమో కావో ఇతమిద్ధంగా చెప్పాల్సిన అవసరం లేకపోయినా, రచయితగా బుచ్చిబాబు చేసే తత్వ విచారణ మాత్రం, ఆయనని రచయితకన్నా కూడా తాత్వికునిగా మరో మెట్టుపైన నిలబెడుతుంది. నా వరకూ ఇందులో కథ ముఖ్యం కానేకాదు. ఆయా పాత్రల నేపథ్యంలో రచయిత వ్యక్తపరుస్తున్న తాత్విక చింతన ముఖ్యం. కోణంలో ఆలోచిస్తే, అద్భుతమైన వాక్యాలు గుట్టలు గుట్టలుగా ఇందులో కనిపిస్తాయి.

సాథారణమైన కథకు అసాథారణతను చేకూర్చింది రచయితలోని అభివ్యక్తే. అద్భుతమైన కవిత్వాత్మక వాక్యాలవల్లనే, పేలవమైన కథ కూడా చదివింపజేస్తుంది. అద్భుతమైన వాక్యాలతో, కావ్య సృష్టి జరిగుంటే, మన జ్ఞానపీఠాలకు ఖచ్చితంగా గౌరవం దక్కి ఉండేదని నా నిశ్చితాభిప్రాయం.

ఓ రెండు ఆణిముత్యాల్లాంటి పంక్తులు చూద్దాం : 

* * *

గడ్డిపోచ విలువెంత?

చివరికి మిగలడం! పడమటి ఆకాశంలో సూర్యుడు ఎర్రగా ఆవులించి మరో ప్రపంచంలో మూర్ఛిల్లిపోతే మిగిలినవి, పగటిని వదల లేక రాత్రిని వెతుక్కునే మత్తు మేఘాలు, నక్షత్రాలు  భయంతో మెరుస్తున్నాయి. కాలవ తోకని త్రిప్పుకుంటున్న నల్లత్రాచులా వంకర తిరిగి అంతర్ధానమైంది. ఆకాశం కేసి చూస్తూ ఒడ్డున గడ్డిపోచల మధ్య దయానిధి నవ్వుకున్నాడు.

అంత భయపడాల్సిన అవసరం ఏమిటన్నట్లు దయానిధి నవ్వినట్లు అనిపిస్తుంది. అవసరం లేదంటూ, బుచ్చిబాబు తర్వాతి పంక్తుల్లో చెప్పే వాక్యాలు అనితరసాధ్యం.

శరీరాన్ని ఆవరించుకున్న గాలి అందమైన అల్పానుభవం. శరీరం దాహంతో వికసిస్తుంది. ...... కళ్ళు చూడడంమానుకుని దర్శిస్తాయి. పడమటి ఆకాశంలో పూడుకుంటున్న పుండు రాత్రి వెదకటం విరమించుకున్న మేఘాలు, భయం లేకుండా మెరుస్తున్న నక్షత్రాలు, ........ కదులుతున్న గడ్డిపోచలు, మూగ భక్తితో ప్రశాంతం చెందిన ప్రకృతి, తనూ - అన్నీ ఏకమైపోయి ఒక్కసారి చైతన్యం పోగొట్టుకొని, ప్రపంచంతో నిమిత్తం లేకుండా ఉండిపోయాయి.

* * *

అలలు మెల్లగా గట్టు మీద ఊపిరి తీసుకుంటున్నాయి. మట్టిలో వేడిగాలి పైకి వెళ్ళలేక భూమినే ఆవరించుకుంది. పొడుస్తున్న చుక్కల ప్రతిబింబాలు చెరువులో పడ్డాయి.

* * *

చెప్పుకుంటూ పోతే, దాదాపు సగం పుస్తకాన్ని వ్రాయాల్సి ఉంటుంది. పేలవమైన కథ కారణంగా, కథనంలోనిఅద్భుతమైన సాహితీ విలువలు ఎలా నిరుపయోగమయ్యాయో అనేదే నా ఆక్రోశం.

బుచ్చిబాబు మాటల్లోనే నా ఆక్రోశం చెప్పాలంటే "పరిమళం బరువుకీ రంగు వొత్తిడికీ తట్టుకోలేక వూడి పడిపోయిన అడవి పువ్వు; పర్వత శిఖరాన్నుంచి జారి పడిపోయిన మంచు ముద్దలోని నిర్మలత్వం; నిశీధిలో సృష్టి వేసుకున్నమంటలో నడిజ్వాల అర్ధరాత్రి జీవులు కన్న స్వప్నంలోని మూగ బాధ."

Thursday, February 25, 2010

"ఊరి చివర" - చిన్న వివరణ


కవిత్వంలో సామాజిక కోణం కొందరికి మింగుడు పడదేమో అనే ఆసక్తికరమైన అనుమానాన్ని వ్యాఖ్యగా ప్రకటించారు అఫ్సర్ గారు, నా బ్లాగులో. నిజమే, చాలామంది విమర్శకులకు, కవులకు కవిత్వంలో సామాజికత మింగుడుపడదు. నావరకు, కవిత్వంలో సామాజిక భావన అంతర్లీనమైతే బానే ఉంటుంది. కానీ, సో కాల్డ్ సామాజిక కవులు మాత్రం సామాజిక భావనలో అంతర్లీనంగా కూడా కవిత్వాన్ని ప్రవేశపెట్టలేకపోవటమే, ఆలాంటి కవిత్వం మింగుడుపడకపోవటానికి కారణం.

దానికి తోడు, ఓ సునామీనో, బాంబుదాడో, మరో దుర్ఘటనో జరిగినప్పుడు "రక్త మాంస దాహం" పేరిట బలవంతపు తంతు నడిపిస్తారు. ఆ తంతులో పాలుపంచుకోకపోయినా, లేదా విమర్శించినా సంఘీభావం ప్రకటించలేదనే ప్రతివిమర్శతోపాటు, సదరు కవినో, విమర్శకుడినో "అనిబద్ధుడు"గా వెలివేయటం కూడా కద్దు.

ప్రస్తుత తెలుగు కవిత్వంలో, ప్రముఖమైన సామాజిక కవిగా ప్రఖ్యాతి గడించిన శివారెడ్డిగారి కవితలు చాలావరకు, ఒకానొక పూనకంతో కవిత్వానికి హద్దులు చెరిపేసే ప్రయత్నాలే. అంతేకాదు, అతి విస్తరణ దోషాలు కూడా ఆయన కవిత్వంలో పరిపాటి. ఆయన ఆదర్శంతో కలం పట్టిన చాలామంది చిన్న, చితక కవులు కూడా అలా స్పందించగలిగితేనే కవులం కాగలమనే భ్రమల్లో ఉన్నారనేది వాస్తవం. ఈ పరిస్థితుల నేపథ్యంలో అఫ్సర్ గారి కొన్ని కవితలు అసంతృప్తి కలిగించాయని చెప్పటం జరిగింది. సామాజికతను అంతర్లీనంగా చొప్పించిన కొన్ని అద్భుతమైన కవితలు చూసాక, ఆ అసంతృప్తి మరికొంత ఎక్కువయ్యింది. అంతేకానీ, శివారెడ్డి ప్రభావం అఫ్సర్ గారి మీద ఉన్నదని చెప్పే తప్పు మాత్రం చేయలేదండోయ్.

ఒకానొక చోట అదేలాంటి ఆవేశం, మరికొన్ని చోట్ల అదేలాంటి విస్తరణ నాకు కనిపించింది ఈ సంకలనంలో. ఇక ఈ రాజకీయ, సామాజిక వాసనలని పక్కనపెట్టి, మరికొన్ని మంచి కవితలు ఆస్వాదించుకుందాం.

* * *

మరోసారి చదివిన తర్వాత, అద్భుతమనిపించే మరో విశేషమేమిటంటే, అనుభూతులను ఆస్వాదించటంలో పాఠకులకు కలిగే స్వేచ్ఛ. ఒకానొక అనుభూతికే, పాఠకులను పరిమితం చేసే కవిత్వం కాదు. ముఖ్యంగా కవిత్వాతీత స్థితిని ఆస్వాదించాలనుకునే నాలాంటి పాఠకులకు కొన్ని వాక్యాలు అనిర్వచనీయం.

నీటి కడుపులోకి వెళ్ళి
మళ్ళీ తీరమ్మీదకి
పసిపిల్లాడిలా పరుగెత్తుకుంటూ వచ్చే అల
బతుక్కి ఇంకో తలుపు - మరణం

* * *

చిన్న చీకట్లు
పెద్ద మరణాలు ఎలా అవుతాయో
ఎప్పటికీ అర్ధం కాదు
కొన్ని మరణాలు
పెద్ద చీకటిలా ముసురుకోవడం
రోజు తెలుస్తూనే వుంది

* * *

వొక సెలయేరు
పరిగెత్తుకుంటూ వెళ్తూ
కాసిన్ని నీటి బిందువుల్ని
పై మీద చిలకరించి వెళ్ళింది
తీరా చూస్తే
ఆ నీటి బిందువు నేనే
అచ్చంగా

* * *

లోపలి ధ్యానంలో
మెట్లు కనిపించవు
మెల్లగా వొక తీగని చేతులకు చుట్టుకుని
శిఖరం కొసకి చేరుకుంటాం
అక్కడి నిశ్శబ్దం చివరి మీంచి
ఈదురుగాలుల హోరులోనో
అందీ అందని మబ్బుల్లోనో
వొంటరిగా నిలబడి
లోపలికి ప్రవహిస్తాం

* * *

బయట విరగ్గాస్తున్న ఎండకి
లోపటి చీకటి తెలుస్తుందో లేదో!
కాసేపు
గొంతుక
వ్యాహ్యాళికెళ్తుంది మౌనంలోకి
గాలి కోసం
కాసింత వూపిరి కోసం.

* * *

ఏదేమైనా, ఈ సంకలనంలో అద్భుతమైన కవిత్వం చాలా ఉన్నదనే విషయంలో ఎటువంటి అనుమానమూ లేదు.

Wednesday, February 24, 2010

"ఊరి చివర" ఉప్పెనలా కవిత్వం

అడపాదడపా అంతర్జాలంలో చదవటమే అఫ్సర్ గారి కవిత్వాన్ని. అక్కడక్కడ, ఆయనని మాటల్లో దించి సందేహాలకు సమాధానాలు వెతుక్కునేవాడిని ఆయన వ్యాసాల్లో. అంతకు మించి ఆయనతో ఎటువంటి పరిచయం లేదు. అంతర్జాలంలో సాహితీ సహవాసానికి, ఆ మాత్రం పరిచయం సరిపోతుందేమో కదా! "ఊరి చివర" ఉప్పెనలా పొంగిన అఫ్సర్ గారి కవిత్వంపై నా అభిప్రాయమే ఈ వ్యాసం.

ఇప్పటి రోజుల్లో, ఊరు చివర అనగానే నిజంగా నిస్తేజమై స్ఫురించే ఒకానొక చిత్రమే ఈ "ఊరు చివర" కూడా. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాదు, మనను చుట్టుముట్టిన ప్రపంచాన్ని నిజాయితీగా ఆవిష్కరింపచేసే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది ఇందులో. సామాన్యంగా కవిత్వంలో సామాజికతను చొరబెట్టాలని కొందరు చేసే ప్రయత్నంలో, పడికట్టు పదాల విన్యాసమే కనిపిస్తుంది. ఆ విన్యాసాల సంరంభంలో ఊళ్ళు తగలబడతాయి, ఆకాశాలు విరిగిపడతాయి, చేతులు నరకబడతాయి, అలానే కవిత్వమూ కూలబడుతుంది. ఈ విన్యాసాలకు దాదాపు అతీతంగా, ఊరు చివర నిలువెత్తు "నిశ్శబ్దంలో" నిలుస్తుంది అఫ్సర్ గారి కవిత్వం.

ఈ పుస్తకం చదవాలంటే, ఊరి చివర నుంచి ఊళ్ళోకి ప్రవేశించాలి. వరుసబెట్టి, మూడు సార్లు చదివిన తర్వాత నేను తీర్మానించిన విషయం ఇది :)) మీకు అర్ధమైన విషయం కరెక్టే... ఈ పుస్తకం చివరి నుంచి ఓసారి, మొదటి నుంచి ఓసారి చదివి చూడండి.

జండాలో జాతీయ గీతాలో
పార్టీలో రాజ్యాంగాలో రాజ్యాలో
వోటు హక్కులో ఎన్నయినా వుండనీ
గుప్పెడు మెతుకులే రాజ్యాంగం మాకు
గుక్కెడు నీళ్ళే జాతీయ గీతం మాకు

ఈ సంకలనంలో కవి ఆవిష్కరింపబోయే విషయం ఇక్కడే చూచాయగా తెలుస్తుంది. అందమైన నిశ్శబ్దంలో అలరించే పాలపిట్టల పకపకల కోసం "ఊరి చివర"కు వెళ్ళొద్దు. ఎవరు వెళతారో "చివరికి" కవి మాటల్లోనే చూస్తే బాగుంటుంది :

ఎవరొస్తారో
ఈ వూరి చివరకి!
ఆకాశం కూడా వేలు విడిచిన
దిక్కులేని దేహం కొసకి.
మాటలన్నీ రాలిపోయి
మోడై నిలిచిన చెట్టు కొసకి.

వొళ్ళంతా పిడచకట్టి
పగిలిపోయిన చెరువు వొడ్డుకి
వొక్క దేహమే వెయ్యి ముక్కలయిన
శకలాల ఎముకల కలలతోపుకి.
ఎవ్వరొస్తారో ఈ వూరి చివరకి?

చివరికి వచ్చింది "ఎవరికైనా, ప్రేమతోనే" కవి చెబుతున్న విషయం, ముఖ్యంగా మన అంతర్జాల కవి మిత్రులకు కనువిప్పు కావాల్సిందే :

నడుస్తొందే, వొక సంతలో!
అన్నీ తెగనమ్ముకున్న
అన్నీ ఎక్కడికక్కడ దిగవిడిచిన
మార్కెట్ సరుకుల సమూహం.

నేపథ్యాల రణగొణ ధ్వనులెందుకులే,
పద్యాల మధ్య
రాజకీయ నినాదాల హోరెందుకులే,
అన్నీ మర్చిపోయిన జాతికి
నీతివాక్యాల ముక్తాయింపులెందుకులే
.....
.....
నువ్వేమిటో
నీ పద్యమే చెబుతుంది!
తెగిన నీ పద్య పాదానికి
కట్టు కట్టలేను, క్షమించు,
.....
.....
మళ్ళీ రాయ్
పిచ్చి గీతల మధ్య అ ఆలు వెతుక్కో
అప్పటికీ నీకు నువ్వు దొరక్కపోతే
ఓ పిల్లాడి చేతిలో
బొమ్మవై పో!
వాడి ఆటలో కాసింత ఆనందపు తుంకవై పో!
అప్పుడింక కొత్త మాట రాయ్!

హిందిలో "ఓ ఆ రహా హై, ఖానా ఖానే కే లియే" అనేది శుద్ధ వచనం. అదే వాక్యాన్ని, నేను విన్న కొందరు హిందీ కవులు "ఆ రహా హై ఓ, ఖానే కే లియే ఖానా" అంటారు అదేదో విరగదీసే కవిత్వం చెబుతున్నట్లు. అలా ఉన్నాయి ఓ రెండు వాక్యాలు ఈ కవితలో (నడుస్తోందే, వొక సంతలో!....పరిగెత్తుతోంది వొక సంతలో!...). అవి సిల్లీ విషయాలైనా, నా అభిప్రాయం చెప్పాలనిపించేసింది, చెబుతున్నాను.

ఇలా అనుకున్నానో లేదో, ఆశ్చర్యం గొలిపుతూ "ఇఖ్ రా!"

లోకం
నాకు వంకరగా కనిపిస్తుందనే కదా
నువ్వెప్పుడూ అంటావ్

లోకం కాదు
నేనే వంకరగా వున్నానని కదా, నీ అర్ధం!
.....
.....
ఇంతకీ

ప్రశ్నని మించిన వక్రరేఖ
ఏదీ ఇంకోటి చూపించు.

అంటూ... మొహంలో మొహం పెట్టి అఫ్సర్ గారు ప్రశ్నిస్తూ వ్రాసిన ఈ కవిత, నా వరకూ శివారెడ్డి మార్కు అద్భుతమైన కవిత! అఫ్సర్ గారి బెంచ్ మార్క్ ప్రకారం ఓ సాథారణ కవిత. అన్నట్లు, ఏ సందర్భంలో ఈ కవిత పెల్లుబికిందో చెప్పనవసరంలేదు అనిపించింది. ఎందుకంటే, ఇప్పటి కాలమాన పరిస్థితుల మధ్య ఎప్పటికీ అన్వయించుకోగల కవిత ఇది. ఇటువంటి, అఫ్సర్ మార్కు సాథారణ కవితలు అక్కడక్కడ కనిపించాయనే చెప్పక తప్పదు.

కరెక్టుగా చివరి నుంచి నాలుగో కవిత "నాలుగు మెతుకులు"

బయట విరగ్గాస్తున్న ఎండకి
లోపటి చీకటి తెలుస్తుందో లేదో!
కాసేపు
గొంతుక
వ్యాహ్యాళికెళ్తుంది మౌనంలోకి
గాలి కోసం
కాసింత వూపిరి కోసం
.....
.....
ఒక్కోసారి నువ్వూ నేనూ
రెండు అలల కేకలం
మరోసారి
నిద్ర పొరల కింద వొత్తిగిలిన కలలం.
.....
.....
ఈ నాలుగు మెతుకులూ
దాచి వుంచు
ఏ దూరాల నించో వచ్చే
ఆ దిగులు బావి
ఖాళీ కడుపు కోసం!

ఈ "నాలుగు మెతుకులతో" చిక్కటి కవిత్వం కోసం అలమటించేవారికి పంచభక్ష్య పరమాన్నం వండి వడ్డించారు అఫ్సర్ గారు. చాలా అద్భుతమైన కవిత్వం. ఇలా తేరుకునే లోపే..."థియేటర్ స్క్వేర్" లోకి ఆహ్వానిస్తారు కవి.

ఒక నిశ్శబ్దంలోకి అందరూ
మౌనంగా
తెరమీద
ఎవరి కథల్ని వాళ్ళే విప్పుకుంటారు తీరా...
.....
.....
ఎవరి జీవితం వాళ్ళకి చేదు
అవతలి బతుకు
కాసేపు అద్దం
తెలియని అర్ధానికి
.....
.....
థియేటరు
నన్ను అనువదించే యంత్రం
ఇక్కడ
నన్ను నేను వెతుక్కుంటాను
ప్రతి సాయంత్రం

చెప్పుకుంటూ పోతే, చాలా కవితలున్నాయి. ఇవన్నీ ఒకరు చెబితే వినటం కన్నా, చదివి తీరాల్సిన అనుభూతులు ఒక్కో కవిత. కంట తడిపెట్టించేవి కొన్నైతే, కలకలం రేపేవి కొన్ని.జి.వి.ఎన్ మూర్తిగారు "ఈనాడు"లో చెప్పినట్లు, మన లోతులని మనమే తడుముకునేట్లు చేసే కవిత్వం ఇది.

కవి సమాధి
ఒక కొల్లేజ్ పోయెం
నీరెండలో వూరు
రెండంటే రెండు మాటలు
.....
.....
అనుమానితుడి ఆత్మకథనం (నాకెందుకో మా అన్నాజీ ఇక్బాల్ చంద్ గారి "ఆరో వర్ణం" కవిత గుర్తుకొచ్చింది. "ఆరో వర్ణం"లోని క్లుప్తత మాత్రం ఈ కవితలో లేదు. అయినా బాగుంది, అది వేరే విషయం.)

జటిలమైన కొన్ని అనుభూతులుంటాయి. అందులోనూ పరభాషా కవిత్వంలో, అక్కడి మహాకవులు వ్రాసినవి. సామాన్య భాషకు, సామాన్య కవులకు ఆ అనుభూతులు అందవు. అటువంటి అనుభూతులు కూడా అలవోకగా, తనదైన శైలిలో కవిత్వమై పారిస్తారు అఫ్సర్ గారు "సరిగంగ స్నానం" అనే కవితలో. అది అనువాదమని ఆయన చెబితే గానీ, బహుశా మనం తెలుసుకోలేమేమో!

మంచి కవితల గురించి తక్కువగానే అయినా, ఎలాగూ చెప్పుకున్నాం కాబట్టి, ఒకట్రెండు దిష్టి చుక్కల గురించి (ఐ మీన్ శివారెడ్డి మార్కు అద్భుత కవిత్వం కూడా ఉదహరించుకుందాం.)

కలలో ఈద్ గాహ్
డెజావూ...
వీరుడి శిరస్సు

అద్భుతమైన ఉద్వేగాన్ని మిగిల్చినా, శివారెడ్డిని మించిన పద ప్రయోగాలు చేసారు అఫ్సర్ గారు. అంతకు మించి అభిప్రాయాన్ని చెబితే, "ఊరి చివర"కు ద్రోహం చేసినట్లౌతుంది కాబట్టి, ఇక్కడితో విరమిస్తా.

అన్నట్లు, అఫ్సర్ గారికి నాదో మనవి.  వీలువెంట, ఈ కవితలని అంతర్జాలంలో కూడా ఆవిష్కరిస్తే బాగుంటుంది.

మరో చివరి మాట. ఈ పుస్తకాన్ని చివరిని నుంచి చదవమని చెప్పటానికి ఉన్న మరో ముఖ్యమైన కారణం - గుడిపాటి గారు, ఎన్. వేణుగోపాల్ గారు వ్రాసిన ఆప్త వాక్యాలు. ముందుగా అవి చదివితే, వారి మాటలు దురభిమానంగా పాఠకులు అనుమానించే అవకాశం ఉంటుంది. మొత్తం కవితలు చదివాక, వారి ఆప్తవాక్యాలు ఎంత నిజమనేది తెలుస్తుంది.