ఆనాడు, స్వతంత్ర భారతంలో పరాధీనగా మిగిలిన "కోటి రతనాల వీణ" చేసిన ఆ సాయుధపోరాటంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు, ఈరోజు కె.సి.ఆర్. వలన బూడిదలో పోసిన పన్నీరైనాయి. అంతకు మించిన ఆవేదన ఏమిటంటే, ఈ రోజు "ప్రత్యేక తెలంగాణా' ఉద్యమం కే.సి.ఆర్. లాంటి నేత వలన ఓ జోక్ గా మిగిలిపోయింది.
ప్రజాభీష్టానికి, మొదటి ఎస్సార్సీ ప్రతిపాదనలకు విరుద్ధంగా "విశాలాంధ్ర" ఏర్పడిందనేది సత్యం. ప్రస్తుతానికి ఆ విషయం జోలికి పోకుండా, ఒక ఉద్యమాన్ని కె.సి.ఆర్. తన స్వార్ధ రాజకీయాల కోసం, ఎలా పక్కదోవ పట్టించింది ఓసారి నెమరువేసుకుందాం.
పోరాటంతో సాధించాల్సిన తెలంగాణాను, అడుక్కుని, దేబిరించే స్థాయికి దిగజార్చిన ఘనుడు కె.సి.ఆర్. ప్రత్యేక తెలంగాణాయే లక్ష్యంగా ఆవిర్భవించిన తె.రా.స., కె.సి.ఆర్. నాయకత్వంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు తప్పటడుగులు వేస్తూనే వచ్చింది.
చెన్నారెడ్డి నేతృత్వంలో కొనసాగిన తెలంగాణా ఉద్యమాన్ని కాంగ్రెస్ ఎలా నీరుకార్చిందో తెలిసినా, ఏ నమ్మకంతో కె.సి.ఆర్., ముందుగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారో ఇప్పటికీ అర్ధం కాదు. అప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాతైనా పరిస్థితులు సమీక్షించుకోకుండా ఆనాడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవుల కోసం సాగిలపడ్డ విషయం ఇంకా మరచిపోలేదు.
ఏ విభాగమూ లేకపోయినా మంత్రి పదవిలో కొనసాగిన కే.సి.ఆర్. ఆనాటి కేంద్రప్రభుత్వ ఉమ్మడి కార్యక్రమంలో ప్రత్యేక తెలంగాణా చేర్చాలని ఎందుకు పోరాడలేదు?
ప్రజాస్వామ్య దేశంలో పది రకాల అభిప్రాయాల కన్న, మెజారిటీ అభిప్రాయానికే విలువ ఎక్కువన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, ఏకాభిప్రాయ సాధన కోసం కృషి చేస్తున్నామని కల్లబొల్లి కబుర్లు చెప్పింది ఏమాశించి?
తెలంగాణా పై నిజాయితీ నిరూపించుకుంటానని, ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్న నేత, అర పూట కూడా ఉపవాసం ఉండలేక, అప్పటి లోక్ సభ స్పీకర్ మొహమాటానికి అన్నదే తడవుగా దీక్ష విరమించుకోలేదా? చిత్తశుద్ధి లేకుండా చేసే చండీ యాగాల వలనా తెలంగాణా వచ్చేది?
తెలంగాణా ప్రజలు, నిజంగానే తనను, ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని సమాదరిస్తారనుకుని ఉంటే, నిరుటి ఎన్నికలలో తె.దే.పా., కమ్యూనిస్టులతో చేతులు ఎందుకు కలపటం? ఒంటరి పోరు ఎందుకని సాగించలేదు. తన నిజాయితీని తెలంగాణా ప్రజలు అంతకు మునుపు జరిగిన ఉప ఎన్నికల్లో శంకించారని తెలుసు కాబట్టే, ఇతర పార్టీలతో జట్టు కట్టింది అనే విషయం అర్ధం చేసుకోలేని అమాయకులు కాదు తెలంగాణా ప్రజలు.
తన నిజాయితీ మీద, తెలంగాణాపై తన నిబద్ధత మీద ప్రజలకు నమ్మకం లేదని గ్రహించబట్టే, గ్రేటర్ ఎన్నికల్లో తె.రా.స. పోటీ చేయకుండా కె.సి.ఆర్. అడ్డుపడ్డాడనేది వాస్తవం కాదా?
తెలంగాణా వచ్చుడో, కె.సి.ఆర్. సచ్చుడో అన్న నాయకుడు, నెల రోజుల ముందరే ఆర్భాటంగా ప్రకటించిన ఆమరణ నిరాహార దీక్షకి ఇప్పుడు కూడా అదే గతి పట్టటం ఆశ్చర్యం కాదు.
చేవలేని నాయకుడు చేసే పోరాటం వల్ల, ఆ ఉద్యమమే భ్రష్టు పట్టే అవకాశం ఉంటుందని కె.సి.ఆర్. నిరూపించాడు. కె.సి.ఆర్. చేత బలవంతంగా రాజకీయ సన్యాసం చేయించి, పొట్టి శ్రీరాములు లాంటి మరో నిస్వార్ధ నాయకుడిని ఎన్నుకోవటం వలన మాత్రమే, ప్రత్యేక తెలంగాణా సాధ్యమౌతుందని తెలంగాణా ప్రజలు గ్రహించాలి.
