Wednesday, June 4, 2008

నేతలకు గుణపాఠం

ఎట్టకేలకు ఉప ఎన్నికలు ముగిసాయి. ప్రత్యేక తెలంగాణాకు ఈ ఎన్నికలు రెఫరెండం అని, తాడో పేడో, చావో రేవో తేల్చేసుకుందామని శాసనసభ, లోక్ సభలకు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు కారణమైన తెరాస పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టబోయినట్లైంది.

ప్రజలు ఎవరిని ఆదరించారు? ప్రత్యేక తెలంగాణా పై ఆ ప్రాంత ప్రజల మనోభావమేమిటి? అసలు ఈ ఉప ఎన్నికల్లో గెలిచిందెవరు? ఇలా చాలానే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఎవరికి అనుకూలమైన విశ్లేషణలు వారు చేసుకుంటున్నారు.


ప్రచారం ఊపందుకున్న సమయం నుంచి చివరి వరకు కాంగ్రెస్ - తెలుగుదేశంల ప్రచారాన్ని గమనిస్తే, ఒకానొక దశలో ఈ రెండు పార్టీలు తెలంగాణాకు అనుకూలమైన ప్రకటనలు విడుదల చేసి ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు చేసాయనటంలో సందేహం లేదు. మరోపక్క, అనవసరమైన పొలికేకలతో ప్రజలను రెచ్చేగొట్టే దిశగా తెరాస ప్రచారం కూడా ఓట్ల వర్షంలో తడవటమే ఆలస్యం అన్నట్లుగా జరిగింది.

ఒక్క తెరాస, భాజపా తప్పించి ప్రత్యేక తెలంగాణాపై నిర్ధిష్టమైన అభిప్రాయం లేకుండానే కాంగ్రెస్, తెలుగుదేశంలో ఎన్నికల్లో పోటీ చేసాయనేది వాస్తవం. ఆ లోటును కప్పిపుచ్చుకునేందుకు అభివృద్ధి మంత్రం వేస్తూనే, తెలంగాణా సెంటిమెంటు ఉన్నదని ముఖ్యమంత్రి, ఇతర సీనియర్ నేతలు ఒప్పుకోవటం, అలానే, తెలుగుదేశం కూడా అంతర్గతంగా ఒక కమిటీని వేయటం, ప్రతి మీటింగు తర్వాత జై తెలంగాణా, జై తెలుగుదేశం అని నినాదాలు చేయటం; తెలంగాణావాదుల ఓట్లను ఆకర్షించటానికి మాత్రమే అని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.

ఎన్నికల సమయంలో ప్రజలేం కావాలనుకుంటున్నారో అంచనా వేయలేక, ప్రజలను తికమక పెడదామనుకున్న పార్టీలే, ఫలితాలు తెలిసిన తర్వాత తికమకకు గురౌతున్నాయి.

ఆరు జిల్లాల్లో ప్రాతినిథ్యం కూడా లేకుండా తెరాసను ఓడించి, ప్రత్యేక తెలంగాణా అవసరంలేదని ప్రజలు చెప్పారనుకోవాలా? అభివృద్ధి మంత్రానికి కట్టుబడ్డ కాంగ్రెస్ ను గెలిపించారు కాబట్టి, తెలంగాణాలో అభివృద్ధిని ప్రజలు హర్షిస్తున్నారనుకోవాలా? మరి, సెంటిమెంటు నిజమే అన్న ముఖ్యమంత్రి ఏం చేయబోతున్నారు ఆ సెంటిమెంటు విషయంలో?

సమైక్యాంద్రపై కట్టుబడ్డ తెలుగుదేశాన్ని గెలిపించారు కాబట్టి, కలిసి ఉందామనేదే ప్రజా ఉద్దేశ్యమనుకోవాలా? మరి, తెలంగాణా సెంటిమెంటును గౌరవిస్తూ అంతర్గతంగా తెలుగుదేశం ఏర్పాటుచేసుకున్న కమిటీ పరిస్థితి ఏమిటి?

నాయకులు తెలివి మీరితే, అధికారాన్ని అప్పగించిన ప్రజలే అంధకారంలోకి నెట్టిపడేస్తారనే విషయాన్ని ఈ ఎన్నికలు మరోమారు రూఢీ చేసాయి. గత సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటి ఉప ఎన్నికల వరకూ, ప్రజల సెంటిమెంటుతో పాచికలు ఆడుకున్న తెరాసకు ఇది ఓ గుణపాఠం. ప్రత్యేక తెలంగాణా సెంటిమెంటు అన్నిచోట్లా ఉన్నదని ఎలా చెప్పలేమో, లేదని కూడా అలానే చెప్పలేం.

ప్రత్యేక తెలంగాణాయే లక్ష్యంగా ఆవిర్భవించిన తెరాస, ఆనాటి నుంచి ఈనాటి వరకూ తప్పటడుగులే వేస్తూ వచ్చింది.

మునుపు తెలంగాణా ఉద్యమాన్ని నీరుగార్చిన కాంగ్రెస్ పై ఏ నమ్మకంతో తెరాస గత సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంది? ఏరు దాటాక తెప్ప తగలేయటం కాంగ్రెస్ కు కొత్తకాదన్న విషయం ఈ నెతలకు తెలియదా?

అప్పడు ఫలితాలు వచ్చిన తర్వాతైనా పరిస్థితులు సమీక్షుంచుకోక, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవులకై మల్లగుల్లాలు పడిన ఈ నేతలకు తెలంగాణాపై ఏవిధమైన నిబద్ధత ఉన్నదనేది తెలుగుసుకోలేని వాజమ్మలు కాదు ప్రజలు.

కూర్చోటానికి ఓ మంత్రి పదవి పడేస్తే చాలు, ఏ విభాగమూ లేకపోయినా ఓకే అంటూ కక్కుర్తి పడే నేతలు, కేంద్ర ప్రభుత్వ కనీస ఉమ్మడి కార్యక్రమంలో ప్రత్యేక తెలంగాణా ఏర్పాటును ఎందుకు చేర్చలేదో ప్రజలకు అర్ధంకాని విషయమేమీ కాదు.

ప్రజాస్వామ్య దేశంలో పది రకాల అభిప్రాయాల కన్నా, మెజారిటీ అభిప్రాయానికే విలువ ఎక్కువన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఏకాభిప్రాయసాధన కోసం కృషిచేస్తున్నామన్న ఈ నేతల కల్లబొల్లి కబుర్లకు ప్రజలు సరైన సమాధానమే ఇచ్చారు.

ప్రభుత్వంలో పాలుపంచుకుంటే కన్నా కూడా, ప్రజలతో ఉద్యమాన్ని పంచుకుంటేనే రాజకీయ మనుగడ సాధ్యమనే విషయాన్ని విస్మరించినందుకు ప్రజలు సరైన గుణపాఠమే చెప్పారు.

గతంలో పట్టం కట్టిన ప్రజలే, ఈ రోజు చెంపపెట్టులా ఓటేసారంటే దానికి కారణం... అంతర్గత కుమ్ములాటల్లోనూ, నకిలీవీసాలతో డబ్బు దండుకునే నేతలపై రోతతోనే.

తెరాస నాయకత్వంలో మార్పు తప్పనిసరి. ప్రత్యేక తెలంగాణా సాధ్యపడేది అమరజీవిలాంటి పొట్టి శ్రీరాములు లాంటి నేతలవల్లనే కాని, అరపూట కూడా ఉపవాసం చేయలేని కెసిఆర్ లతో కాదు. నిబద్ధత, నిజాయితీ లేని నేతలందరికీ... ముఖ్యంగా తెలంగాణా నేతలకు ఈ ఉప ఎన్నికలు కనువిప్పు కావాలి.


No comments:

Post a Comment

మీ అభిప్రాయం :