Wednesday, July 23, 2008

మేడిపండు ప్రజాస్వామ్యం 02

ఎత్తుకు పై ఎత్తులతో జిత్తులమారి వేషాలతో మన నేతలు వేసిన కుప్పిగంతులు ప్రస్తుతానికో కొలిక్కి వచ్చాయి. పంథొమ్మిది ఓట్ల ఆధిక్యంతో ప్రభుత్వాన్ని నిలుపుకున్న మన్మోహన్ సింగ్ విజయదరహాసంతో పరువు దక్కించుకోగలిగానన్న స్ఫూర్తిని ప్రదర్శించినా, నలుగురి ముందు నగుబాటుకు లోనయ్యింది మాత్రం మన ప్రజాస్వామ్యమే.

అభినవ దుశ్శాసనుల రాజ'నీతి'కి ప్రజాస్వామ్యం వలువలు ఊడదీయబడ్డ ద్రౌపదిలా కుంచించుకుపోతోంది. దేశ ప్రజాస్వామ్యం పార్లమెంటు సాక్షిగా పరిహాసాస్పదమైంది. ఏ పార్లమెంటు సభ్యుడు అమ్ముడుపోలేదట! మరెవరూ కొనలేదట!!

పార్లమెంటులో ప్రశ్నలు అడగటానికి పదివేల రూపాయల కోసం కక్కుర్తిపడే మన గౌరవ సభ్యులు అంతరాత్మ ప్రబోధంతో ఓట్లు వేసి యు.పి.ఎ.ని గెలిపించారనుకుందామా? తిమ్మిని బమ్మి చేసే మన నాయకుల తెలివితేటలతో, ప్రజాస్వామ్యం అంతకంతకూ అగాధాలలో కూరుకుపోతోంది. నైతిక విలువలు దిగజారుతున్న కొద్దీ మరిన్ని లోతులు చవిచూస్తున్నది.

ప్రతి పార్లమెంటు సభ్యుడికి 25 కోట్లతో యు.పి.ఎ. వెల కట్టిందని సి.పి.ఐ. నాయకుడు ఎ.బి.బర్ధన్ పత్రికా ప్రకటన మాత్రమే చేస్తే, అమర్ సింగ్ , అహమ్మద్ పటేల్ కోటి రూపాయలు అడ్వాన్సు ఇచ్చారని ఆ డబ్బును సాక్షాత్తు పార్లమెంటులో ప్రదర్శించారు భా.జ.పా. నేతలు. Any way, no one is a holy cow.

కొనడానికి మన నేతలు ఎలా తెగబడ్డారో, అమ్ముడుపోవటానికి కూడా అంతగానే తెగబడ్డారు. సిగ్గెగ్గులు లేకుండా మళ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుక్కునే ఈ నేతలనే మరింత సిగ్గుమాలినతనంతో మనం ఎన్నుకుంటాం.

ఈ హంగామాకు కారణంగా నిల్చిన సి.పి.ఎం. నేత ప్రకాష్ కారట్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని రెండు మూడు రోజుల క్రితం ప్రకటించటం విడ్డూరం కాదు. అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట.

మానిపోయిన గుజరాత్ గాయాలను రేగ్గొట్టటానికి పార్లమేంటునే వేదిక చేసే లాలూ లాంటి నాయకులు, గురువింద గింజ సామెత గుర్తు చేసే విధంగా ఎదుటివారిపై ఆరోపణలు చేసే అద్వాని, అమర్ సింగ్, మన్మోహన్ సింగ్ లాంటి నాయకులు మనకు కొత్త కాదు.
గంతకు తగ్గ బొంతల్లా ఆ గూటి పలుకులే పలికే నేటి యువరాజకీయ నాయకులను చూస్తే మాత్రం మన ప్రజాస్వామ్యం, మన రాజ్యాంగం రేపు వారి చేతుల్లో ఎలా శీలభంగానికి గురౌతుందో అనే ప్రశ్నలు ఉదయించక మానదు.

ఒక ముస్లీములానో, ఒక రాజకీయ నాయకుడుగానో కాకుండా, ఒక భారతీయుడుగా ఆలోచించి ఓటు వేసాడట నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దులా! నిరుటి ఎన్.డి.ఎ. ప్రభుత్వంతో చేతులు కలిపినందుకు సిగ్గుతో చచ్చిపోయాడట! చేసిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నంలో ఇటు ఓటు వేసాడట!

మహారాష్ట్రలోని విదర్భలో ముగ్గురు కొడుకులున్న ఓ యువతిని చూసాడట యువరాజలుంగారు. ముగ్గురు కొడుకుల్లో, ఒకడు కలెక్టరు, ఒకడు ఇంజనీరు, మరొకడు ప్రైవేటు ఉద్యోగాలు సాధిస్తామని చెప్పారట. వెరీగుడ్ అంటూ ఓసారి వెనక్కి తిరిగి చూస్తే, వారి పూరిగుడిసెలో విద్యుత్తు లేదట. ఆ పిల్లల స్వప్నాలు సాకారం చేయాలంటే, అణుఒప్పందం తప్పనిసరట! అయ్యా యువరాజలుంగారు, గత తొమ్మిదేళ్ళుగా మహారాష్ట్రలోని మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పీకుతున్నది?

స్వాతంత్ర్యం వచ్చి అరవైఏళ్ళ పైమాటే అయినా, ప్రజలకు పక్కా ఇళ్ళు ఇవ్వలేని దౌర్భాగ్యం మనది. దాదాపు అర్ధశతాబ్దంపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ వీటికి జవాబుగా అణుఒప్పందాన్ని చూపటం పనికిమాలినతనం. చవటగాళ్ళ చవకబారు రాజకీయాలే ఇవి.

ఉన్న అయిదుగురు ఎంపీలను సంభాళించుకోలేని చంద్రబాబులు, చంద్రశేఖరులు మాయావతిని ప్రధానిగా చేద్దామని ఉబలాటపడటం మన ప్రజాస్వామ్యంలోనే సాధ్యం.
కావల్సినవన్నీ అప్పనంగా పొందాలనుకునే అమాంబాపతు అజిత్ సింగ్ ల, దేవెగౌడల పార్టీలవంటివి మన ప్రజాస్వామ్యంలోనే సాధ్యం.

ఊరకుక్కలైనా , పందికొక్కులైనా ఊరికి కొంతైనా ఉపకారం చేస్తాయి. మరి మన ప్రజాప్రతినిధులో?

2 comments:

  1. మీ ఉద్దేశమ్లో దీనికి మందు ఏంటి?

    ReplyDelete
  2. దీనికి మందు ఒకటే ఒకటి కనపడుతోంది నాకు. అందరిని పార్లమెంట్ బయట వరసగా నిలబెట్టి కాల్చెయ్యటమే. ఉన్నవాళ్ళ పీడా పోతుంది, కొత్తవాళ్ళకు భయం ఉంటుంది.

    ReplyDelete

మీ అభిప్రాయం :