Wednesday, December 16, 2009

తెలంగాణా - శేష ప్రశ్నలు

మొత్తానికి ప్రత్యేక తెలంగాణా అంశాన్ని ప్రస్తుతానికైతే దాదాపుగా అటక ఎక్కించేసినట్లే. గత మూడు నాలుగు వారాలుగా కాలుతున్న రాజకీయ రావణకాష్టంతో రాజకీయ పార్టీలు మాత్రం చలి కాచుకుంటున్నాయి. ఈ మూడు నాలుగు వారాల రాజకీయ కోలాహలాన్ని ఒక్కసారి రివైండ్ చేసి చూస్తే, జవాబులు దొరకని ఎన్నెన్నో ప్రశ్నలు.

దీక్ష కూడ మొదలు కాకుండానే, ఆసుపత్రికి తరలించబడ్డ కె.సి.ఆర్., ఆసుపత్రిలోనే చేసిన పదకొండు రోజుల "సెలైన్ నిరాహారదీక్ష" కు కేంద్ర ప్రభుత్వం నిజంగానే కదిలిపోయి దిగివచ్చిందా? గత అయిదు సంవత్సరాలు తాత్సారం చేస్తూ వచ్చిన అంశంపై పదిరోజుల్లోనే ఓ అవగాహనకు వచ్చి, రాత్రికి రాత్రి ప్రకటించటంలోని విశేషం ఏమై ఉంటుంది?

ఛీ పొమ్మన్నా, పదవులకి, అధికారానికి అంటిపెట్టుకునే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, తెలంగాణా ప్రకటన వెలువడిన తెల్లవారుఝామునే, సమైక్య ఆంధ్రకు అనుకూలంగా రాజీనామాల పర్వం మొదలేయటమేమిటి? రాజ్యాంగ సంక్షోభం కలిగించటం ఏమిటి?

కేంద్ర మంత్రిపదవుల్లోను, కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లోనూ అన్యాయం జరుగుతున్నా పెదవి విప్పని కాంగ్రెస్ నాయకులు, అధినేత్రికే వ్యతిరేకంగా రాజీనామాలు చేసారంటే నమ్మశక్యం కాదు. తనకు, తన తమ్ముడికి, తన కొడుక్కి పదవులు ఇవ్వలేదని గుక్కలు పట్టిన రాయపాటి లాంటి నేత రాజీనామా చేయటం, అనవసరమైన ప్రతిసారీ వీర విధేయత ప్రకటించే లగడపాటి అధిష్టానానికి కాకుండా స్పీకర్ కే రాజీనామా సమర్పించటం అస్సలు నమ్మలేం.

కాంగ్రెస్ బాటలోనే తెలుగుదేశానికి, ప్రజారాజ్యంకు చెందిన ఆంధ్ర రాయల సీమ ఎమ్మెల్యేలు కూడా హడావుడిగా రాజీనామాలు చేయటం కూడా అంతే ఆశ్చర్యకరం, అంతకు మించిన అసహజ పరిణామం. దానికితోడు, తెలంగాణా తెలుగుదేశం కావాలని చంద్రబాబుపై వత్తిడి కూడా తెస్తున్నట్లు కొందరు నాయకులు ప్రకటించటం కూడా విస్మయం కలిగిస్తున్నది. పరాకుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ వేసిన పాచికలకు, ఎదురు వేస్తున్న చంద్రబాబు ఎత్తుగడా ఈ డబుల్ గేం?

ఎప్పుడూ నోరు పారేసుకునే తెలంగాణా కాంగ్రెస్ నేతలు, ఈ మొత్తం వ్యవహారంలొ ఎక్కువ చడీచప్పుడు లేకుండా ఉండటం కూడా మరింత ఆశ్చర్యకరంగా ఉంది.

నిరాహార దీక్షకు నెల రోజుల ముందు నుంచే కె.సి.ఆర్. చేసిన ప్రకటనలు కూడా అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. అసలు, నిరాహార దీక్షను నెల రోజుల ముందే ప్రకటించాల్సిన అవసరం ఏమిటి? ఆనక, రోజు విడిచి రోజు నిరాహార దీక్షలో ఉండే తనను అరెస్టు చేయాలని ప్రయత్నిస్తే ఊరుకోమని ఉరమటం, నిరాహార దీక్ష భగ్నం చేయాలని చూస్తే ఆత్మహత్య చేస్తుకుంటానని బెదిరించటం... ఇవన్నీ నెల రోజుల ముందు నుంచే ఎందుకు చేయాల్సి వచ్చింది?

తన నిరాహార దీక్షకు దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణా ప్రకటించిందని భావిస్తుంటే, సోనియమ్మకు సాగిలబడి ప్రణామాలు చేస్తానని కె.సి.ఆర్. చేసే ప్రకటనల్లోని మర్మం ఏమిటి?

ప్రత్యేక తెలంగాణాపై తమ చిత్తశుద్ధిని ప్రదర్శించటానికి (ప్రకటించటానికి కాదు) కాంగ్రెస్ ఆడిన నాటకమా? లేక, రాజకీయంగా బోర్లపడ్డ తె.రా.స.ను కాంగ్రెస్ గూటికి చేర్చాలని చేసిన ప్రయత్నమా ఇది? లేక, ఆకస్మికంగా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకొని, తెలుగుదేశం పార్టీని గుక్క తిప్పుకోకుండా చీల్చివేయాలని వేసిన పన్నాగమా ఇది? ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది కాబట్టి, ఎన్నికల లబ్ది కోసం చేసింది మాత్రం కాదని స్పష్టమౌతుంది.

ఏది ఏమైనా, అందరూ అనుకుంటున్నట్లుగా ఇది కేంద్రం తీసుకున్న హఠాత్ నిర్ణయం మాత్రం కాదు. ఆచి తూచి వేసిన పాచికలే ప్రత్యేక తెలంగాణా ప్రకటన, ఆపైని మొదలేసిన సమైక్యవాద ఉద్యమపు డ్రామా. ఏమి ఆశించి అన్నది మాత్రం ప్రస్తుతానికి ఓ శేష ప్రశ్నే.

3 comments:

  1. I think part1 and part2 were directed by two different people.
    However results are,
    (1)loss of many innocent people.,
    (2)raising of emotions among many many people which will remain in their hearts for long..,
    (it hurts to see that people living together in a single apartment are fighting. those families which used to share their region special food on festivals are not in talking terms)
    (3)few political heroes have emerged.

    ReplyDelete
  2. పైన మైత్రేయ గారు చెప్పిందే నా అభిప్రాయం కూడా.

    ప్రజల మధ్య మనస్పర్థలు వచ్చాయి. అంతకు మించి మరేమీ లేదు.

    ReplyDelete
  3. Now telangaana issue has become a big political drama...

    ReplyDelete

మీ అభిప్రాయం :