బుర్రతక్కువ సన్నాసులు ఆంధ్రులా, ఆంద్రా కాంగ్రెసు నాయకులా అనేది నాకెప్పుడూ ఉన్న అనుమానమే। అధినాయకులను ప్రసన్నం చేసుకోటానికి కాళ్ళావేళ్ళా పడటం మన కాంగ్రెసు నేతలకి అలవాటే. ఆ ప్రయత్నంలో నానాగడ్డీ కరిచే ఈ నేతల చేష్టలను భరిస్తున్న తెలుగువాళ్ళు నిజంగానే సహనశీలురా లేక చేతగాని వాజమ్మలా అనేది నాకర్ధం కాని విషయం.
మనరాష్ట్రంలో ఉన్నన్ని ఇందిరమ్మ, రాజీవ్ పథకాలు బహుశా మరే రాష్ట్రంలోనూ కనిపించవు. ఇందిర దీపం, రాజీవ్ ఫలానా, ఆఖరికి వీధి చివర కట్టిన మరుగుదొడ్లకు కూడా విధేయత పేరుతో ఈ నాయకులు ఆ నాయకుల పేర్లను పులమటం విచిత్రం!!
వేయి తలలు వేసిన ఈ వెర్రి, ఇప్పుడు రాష్ట్రం పేరే మార్చే దిశలో ఉందని, మొన్న గుంటూరులో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి చేసిన ప్రకటనతో తేటతెల్లమయ్యింది. ప్రజలు కోరితే రాష్ట్రాన్నే ఇందిరమ్మ రాష్ట్రంగా నామకరణం చేస్తామని ప్రజలకు రోకలి చుట్టే ప్రయత్నం చేసారావిడ. ఆ నేతల పట్ల ప్రేమ అంతగా కారిపోతుంటే, తమ పిల్లలకో, వారి వారి పిల్లలకో ఆయా పేర్లు పెట్టుకు ఏడవచ్చుగా! ప్రజల నెత్తిన పేర్లు రుద్దాల్సిన అవసరం ఏముంది?
దేశం పేరునే గాంధీగా మార్చేసి, రాష్ట్రాలను, జిల్లాలను - వాటి పేర్లను ఆ వంశానికే రాసిచ్చే ఘనులు మనరాష్ట్రంలో తప్ప మరెక్కడా కనిపించరేమో? గాంధీ దేశంలో, ఇందిర రాష్ట్రంలో, రాజీవ్ జిల్లాలో, రాహుల్ తాలూకాలో ఫలానా రాజశేఖర్ రెడ్డి అన్న అడ్రసు ఎంత ముచ్చటగా ఉంటుందో! కానిచ్చేయండి ఈ పేర్ల మార్పిడి తతంగం.
గాంధీల కోసం వెంపర్లాడటం మన పక్క రాష్ట్రాల్లో ఇంతగా కనిపించదు. పోనీ, ఇన్ని ముష్టివేషాలు వేసినా, బొచ్చె నిండుతున్నదా అంటే అదీ నిండదు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఒకే రాష్ట్రం నుంచి ఇన్ని పార్లమెంటు సీట్లు కాంగ్రెసు మరే రాష్ట్రం నుంచీ గెలవలేదు. అయినా, ఆంధ్రులపై సవతిప్రేమ. కంటితుడుపు బహుమతుల్లా అనామక మంత్రిత్వశాఖలు, అవైనా మూడో నాలుగో.
అయినా, సిగ్గులేని మన నాయకులు చొంగ కార్చటం మాత్రం మానరు. ఈ బానిసబుద్ధుల నుంచి వీరికి విముక్తెప్పుడో?
పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందని, ఈ కాంగ్రెసుకు పెత్తనం రాగానే రాష్ట్రాన్నంతా గాంధీగా చేస్తున్నారు. మొన్నామధ్య ఏదో క్రికెట్ మ్యాచుకు యువరాజులవారు వేంచేస్తున్నారని, క్రికెట్ స్టేడియంలో మహామహా క్రికెట్ యోధుల ఫొటోల మధ్య రాజీవ్ గాంధి క్రికెటర్ గా ఓ ఫొటో ముస్తాబు చేసారంటేనే రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల స్వామిభక్తి మూసీనదిలా ఎంత గబ్బుకొడుతున్నదో అర్ధమౌతుంది.
రాజీవ్ గాంధి రాష్ట్రానికి ఏం చేసాడో, దేశానికి ఏం చేసాడో అన్నది అనవసరం. ఆ మాటకొస్తే, అధికారంలో ఉండి ఆయన పీకిందేమీ లేదు. ఆయన పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయమా? టంగుటూరి ప్రకాశం పంతులు, బూర్గూల రామకృష్ణారావు, అల్లూరి సీతారామరాజు, వావిలాల గోపాలకృష్ణయ్య, పొట్టి శ్రీరాములు లాంటి మహానుభావులు రాజీవ్ గాంధీ పాటి చేయరా అనేది ప్రశ్న.
వీథి పేర్ల నుంచి విమానాశ్రయాల వరకు పాకిన ఈ పిచ్చి ఇప్పుడు రాష్ట్రానికే పేరు మార్చే దశలో ఉన్నదంటే తెలుగువాళ్ళే దానికి కారణం.
ఫ్లిప్ సైడ్ : తెలంగాణా రాష్ట్రానికి 'రాజీవ్' పేరో 'సోనియా' పేరో పెడతామని తెరాస నాయకులు మాటిస్తే, రేపటికల్లా తెలంగాణా వచ్చేస్తుంది గామోసు.