Thursday, March 20, 2008

చౌకబారి, మసకబారి, మసిపట్టి పోయిందెవరు?

ఎవరో ఒక ఒరియా పెద్దమనిషి తెలుగువాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకు చస్తారంటూ ఏదో సైటులో చేసిన ఓ కామెంటుకు వాపోతూ, తెలుగువాళ్ళం చౌకబారయ్యాం, మసకబారిపోయాం, మసిపట్టిపోయామంటూ ఓ బ్లాగరిగారు ఖిన్నులై ఓ వ్యాసం వ్రాసిపడేశారు నెట్లో। ఆ మనిషి తెలుగువారి మీద ద్వేషంతో వ్రాసినందుకు కాకున్నా, ఆయన అన్న మాటల్లో నిజం ఉన్నందుకు ఈయన తెగ బాధపడిపోయి ఆ వ్యాసం వ్రాసేసారుట! ఆ ఒరియా పెద్దమనిషి మాటలు ఉన్నదున్నట్లు ఉటంకిస్తే తెలుగువాళ్ళం బాధపడిపోతామని అంటూనే, ఈయనగారు తెలుగులో అంతకన్నా ఘనంగానే తిట్టిపోసారేంటని ఆశ్చర్యపోయా కాసేపు.

ఇంతకి అసలు విషయం మన అసెంబ్లీలో నేతల ప్రవర్తనో, ప్రభుత్వంలోని అవినీతో కాదు। ప్రత్యేక తెలంగాణా కోరుకోవటంవల్ల నలుగురి దృష్టిలో పలచనైపోయామని ఈయన బాధ. తెలంగాణా డిమాండు వల్ల, తెలుగుజాతి ప్రతిష్ట దెబ్బతిందట! తెలంగాణా వాదులు ప్రపంచవేదికపై తెలుగుజాతిని బట్టలువిప్పి బద్నామ్ చేసారట! ప్రాంతీయ ఉన్మాదంతో తెలంగాణా వాదులు, నోళ్ళకే పని చెబుతున్నారు కానీ, మెదళ్ళకు కాదని అంటూ, తమ నోటి తీటను నెట్లో వ్రాతలతో ఈయన తీర్చుకున్నారులా ఉంది॥ ఇంకా ఈ వ్యాసంలో తెలుసుకోవాల్సింది, ప్రత్యేక తెలంగాణా కేవలం ఏడు సంవత్సరాల ఉద్యమమని!!

అంతటితో ఆగదు ఆ తీట। శాపనార్ధాలతో కొనసాగుతుంది. పరిస్థితులు ఇలానే ఉండవుట. తెలుగుజాతికి మంచిరోజులు వస్తాయట. అవి రావాలంటే, నిజాం కాలంలో పుట్టిన ముసలివాళ్ళంతా చావాలట! వీళ్ళందరూ ఆకు తొలిచే పురుగులు, తెలుగుజాతికి పట్టిన కాన్సర్లు నట.

ఈయన పెట్టినంతగా, ఆ ఒరియా పెద్దమనిషి కూడా బహుశా ఇన్ని తిట్లు, బూతులు, శాపనార్ధాలు పెట్టి ఉండరు. ఒరియావాడు తెలుగువాళ్ళనేదో అన్నాడని, కన్నీళ్ళ పర్యంతమైన పెద్దమనిషి తను మాత్రం తోటివాళ్ళపై కారుకూతలు కూయొచ్చా?

ఈ వ్యాసం చదివి ఒకరు 'ఆనాడు నెహ్రు కూడా తెలంగాణా కలసి ఉండలేని పక్షంలో విడిపోవచ్చని నిజామాబాద్ సభలో ప్రకటించారు' అని ఓ వ్యాఖ్య వ్రాస్తే, దానికి ఈ మేధావిగారు ఇచ్చే సమాధానం విచిత్రం। ఈయన అంటారు 'నెహ్రూ ఇలా అన్నాడని చెబుతున్నవాళ్ళు ఆ అన్న మాట ఎక్కడుందో ఎవరు ఆమాటని ఆ రోజుల్లో ఏ పత్రికలో ప్రచురించారో ఆధారాలు చూపించలేకపోయారు. ఊరికే పుకార్లు వ్యాపింపజెయ్యడం తప్పిస్తే !' అని ప్రకటించారు.


అయ్యా, ఇక్కడ రెండు విషయాలు గమనించాలి। ఆనాడు నెహ్రూ అన్న మాటలు ఏ వార్తా పత్రికలో వచ్చిందో చెబితే, అది కూడా పుకారు, తారీఖు చెప్పమంటారు. తారీఖు చెబితే, ఆ 'క్లిప్పింగ్' ఆధారంగా చూపించమంటారు. (నెహ్రూ చెప్పిన మాట, 17-అక్టోబరు-1953 ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వచ్చింది. )

రెండో విషయం, ఆ ఒరియా పెద్దమనిషి ఎక్కడ తెలుగుజాతిని నానామాటలు అన్నాడో చెప్పమంటేనే, ఆ లింకు చూపలేని మీరు ఎప్పుడో 50వ దశకంలో నెహ్రూ అన్న మాటకు ప్రమాణం చూపమని అడగటంలో అర్ధం లేదు।

మాట్లాడితే, తూర్పు పశ్చిమ జర్మనీల ఉదాహరణ ఊదరగొడతారు। చెకొస్లోవేకియా గురించి అడిగితే మారు మాట్లాడరు.పాడిందే పాటరా.... అన్నట్లు, తెలంగాణావాదులు ప్రజల ఎమోషన్లను, సెంటిమెంటును రాజేస్తున్నారని విమర్శించే మీరు మాత్రం, సమైక్యవాదన పేరుతో చేసే ఈ అర్ధరహిత వాదనవల్ల ఏం సాధిస్తున్నారు। సమైక్యవాదన పేరుతో తమరు మాత్రం ప్రజలను రెచ్చ కొట్టటంలేదా? తెలుగుజాతి విడిపోకూడడదు, సమైక్యంగా ఉండాలని చేసే ఉద్బోధలే తప్ప, తెలంగాణా కలసి ఉండటంవల్ల కలిగే లాభాలేంటి, విడిపోతే నష్టాలేంటి అనే దానికి మాత్రం సమాధానం ఉండదు. పాడిందే పాటగా మరి.

తెలంగాణావాదులు, మేధావులు అవకాశవాద రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలౌతున్నారని విమర్శించే తమరు, ఏ రాజకీయనాయకుల చేతిలో కీలుబొమ్మలు?

అయ్యా, తెలంగాణా రాదని మీరిచ్చే పిల్లి శాపాలవల్లనో, తెలంగాణా రావాలని కె.సి.ఆర్. చేసే చండీయాగాలవల్లనో పనులు సాగవు. మునుపు చెప్పినట్లుగానే, తెలంగాణా ప్రజల ఉద్యమం. ఇందులో నేతలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఉద్యమం ఆగదు.

http://www.aavakaaya.com/showArticle.aspx?a=li&articleId=471&pageNo=0