Thursday, October 16, 2008

ముక్కలేకపోతున్న ముఖ్యమంత్రి

ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా తెలుగుదేశం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. ఈ నిర్ణయంతో అటు తెలుగుదేశం నుండి బయటకు వచ్చిన దేవేందర్ గౌడ్ కు, ఇటు కాంగ్రెస్ కు ఒకేసారి చెక్ మేట్ చెప్పినట్లయ్యింది. ఏదో ఒక నిర్ణయానికి కాంగ్రెస్ రావల్సిన పరిస్థితుల మధ్య, ఇప్పుడు మత ప్రాతిపదికన తెలంగాణాను వ్యతిరేకించటానికి ముఖ్యమంత్రి సమాయత్తమౌతున్నారు.

ప్రత్యేక తెలంగాణాకు ముస్లీములు వ్యతిరేకమని మజ్లిస్ నేత అల్లిన పలుకులనే చిలకలా ముఖ్యమంత్రి వల్లెవేయటం సిగ్గుపడాల్సిన విషయం. నలుగురైదుగురు మజ్లిస్ ఎమ్మెల్యేల దన్నుతో తెలంగాణాకు మోకాలడ్డగలమని భావించటం బాధాకరం. ఆ మాటకొస్తే, తెలంగాణా వల్ల ముస్లీములకు కలిగే ఇబ్బందులేమిటన్నది ఎవరికీ అర్ధం కాదు. కేవలం మైనారిటీ మతానికి చెందినవారిని ఉద్రేకపరచి, అశ్లీలరాజకీయాన్ని నెరుపుతూ చోద్యం చూడాలన్న దరిద్రపు తలపే ముఖ్యమంత్రి వ్యవహారశైలిలో కనిపిస్తున్నది కానీ, ముస్లీముల సంక్షేమం కాదు. మొన్నటిదాకా కమ్యూనిస్టులే అడ్డమన్న పెద్దమనిషి ఈరోజు హఠాత్తుగా ముస్లీములు కూడా తెలంగాణాకు వ్యతిరేకమని ఎలా తెలుసుకున్నారో ఆయన్నే అడగాలి.

కాంగ్రెస్ మినహా తక్కిన పార్టీలన్నీ ప్రత్యేక తెలంగాణా విషయంలో తమ విధానాన్ని వెలిబుచ్చాయి. ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, తె.రా.స.లు ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా ఏవిధంగా ప్రభావం చూపగలవనేది ఖచ్చితంగా చెప్పలేం. నిరుడు మోసం చేసిన కాంగ్రెస్ ను ఈసారి నమ్మాలనుకోవటంలో అర్ధం లేదు. తెలుగుదేశం, తె.రా.స.ల పరిస్థితే, చిరంజీవి ప్రజారాజ్యం కూడా. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతకాలం ప్రత్యేక తెలంగాణా రాదన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు ఇవ్వరాదనటానికి సరైన కారణాలు కూడా చెప్పలేని నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమీ ఆశించలేం కూడా.

నేత మాటల కనుగుణంగానే, భట్రాజుల ఊపు జోరందుకుంది. తెలంగాణాతోపాటుగా ప్రత్యేక రాయలసీమ, ప్రత్యేక కోస్తా కావాలట. అనంతపురాన్ని కర్ణాటకలో కలిపేయాలట! సాక్షాత్తు రాష్ట్రమంత్రి దివాకర్ రెడ్డి ప్రకటన. రాష్ట్రం కాగితం ముక్క కాదట, అడగ్గానే రెండు ముక్కలు చేసి ఇవ్వటానికి. ఇది కేకే గారి పైత్యం. ఎన్నికలలోపే తెలంగాణా వచ్చే అవకాశాలున్నాయంటూ పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ప్రకటన మరోవైపు. ఇలా, ప్రజలను అయోమయానికి గురిచేయటమే లక్ష్యంగా కాంగ్రెస్ సత్రకాయల జోరు సాగుతున్నది.

ఈ కుటిల ప్రయత్నాల వెనుక ఉన్నది కేవలం ముఖ్యమంత్రే అన్నది అందరికీ తెలిసిన విషయమే. అజీర్ణవ్యాధిగ్రస్తుడు కాలకృత్యాలు తీర్చుకోటానికి ముక్కుతూ మూలుగుతూ ఎలా ప్రయత్నిస్తాడో దాదాపు అదే పరిస్థితిలో ముఖ్యమంత్రి ముక్కుతున్నారు. ముందుగా ప్రణబ్ కమిటీ నివేదికే తేలుస్తుందన్నారు. తర్వాత సోనియాకే నిర్ణయాధికారం ఉందన్నారు. పిమ్మట, ఏకాభిప్రాయమే మార్గమన్నారు. అటు పిమ్మట తెలుగుదేశం, కమ్యూనిస్టులే అడ్డంకి అన్నారు. ఇప్పుడు కొత్తగా ముస్లీములు ప్రత్యేక తెలంగాణాకు వ్యతిరేకమంటున్నారు!

అయ్యా ముఖ్యమంత్రీ... ప్రజాస్వామ్యంతోపాటుగా, ఏ స్వామ్యంలోనైనా ఏకాభిప్రాయసాధన సాధ్యమయ్యేదేనా? ఆ మాటకొస్తే, ప్రజలు ఏకాభిప్రాయంతో ఎన్నుకున్నారనా, ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో యు.పి.ఎ. కొలువుతీరింది? మైనారిటీ అభిప్రాయానికి ఇస్తున్న విలువ, మెజారిటీ అభిప్రాయానికి ఎందుకు ఇవ్వటంలేదు. ప్రత్యేక తెలంగాణా విషయంలో మీ అభిప్రాయం విస్పష్టంగా ఎందుకు చెప్పరు. వ్యక్తిగతంగా మీకే కాకుండా, అసలు పార్టీగా కాంగ్రెస్ కున్న అభిప్రాయం ఏమిటి? తమరు కల్పిస్తున్న అడ్డంకులన్నీ, పదవి కాపాడుకునే ప్రయత్నాలేనా?