మొన్నామధ్య "బుడుగోయ్" గారి బ్లాగులో అనుకుంటాను, ద్వా.నా.శాస్త్రి గారు కవులను, కవిత్వాన్ని నిబద్ధ-అనిబద్ధ అని రెండు రకాలుగా వర్గీకరించినట్లు బొల్లోజు బాబాగారు చెప్పారు. సామాజిక అంశాలను స్పృశిస్తూ వ్రాసిన కవులను, వారి కవిత్వాన్ని "నిబద్ధం" గాను, తద్విరుద్ధమైన కవులను, కవిత్వాన్ని "అనిబద్ధం"గాను వర్గీకరించినట్లుగా నాకర్ధమయ్యింది.
సందర్భం ఎలాగూ వచ్చింది కాబట్టి, అసంబద్ధమైన ఇటువంటి వర్గీకరణలకు పాల్పడే మన విమర్శకులనోసారి ఖండించటం కూడా అవసరమే. ఆ చేత్తోనే మరో మొట్టికాయ మన "కవులకు" కూడా. స్వచ్చమైన కవిత్వం దాదాపు మృగ్యమయ్యింది ఈరోజు. అటు ఛందోబద్ధ కవిత్వమైనా, ఛందోబద్ధం కాని కవిత్వమైనా ఇదే ధోరణి. కవిత్వాన్ని భ్రష్టుపట్టించటంలో ఒకరితో మరొకరు పోటీ పడుతూనే ఉన్నారు. అక్కడక్కడ "సుప్రభ" గారి లాంటివారు తప్పించి, ఆటవెలది, తేటగీతులు తెలిసినంత మాత్రానే పండితులుగా పరిగణించబడుతున్నారు. ఇటు, మహాప్రస్థానమో, అమృతం కురిసిన రాత్రో చదివి కలం పట్టేసుకొని కవులమనుకునే ప్రబుద్ధులకూ కొదవలేదు.
అసలు నిబద్ధత అంటే ఏమిటి? ఏసీ గదిలో కూర్చొన్నా, కవిత్వం వ్రాయని రోజు చెమటలు పట్టినట్లుంటుంది అని ప్రకటించే సినారె గారు అదే ఏసీ గదిలో రిక్షావాడి మీదో, రైతు కూలీ మీదనో నాలుగైదు పేజీలు గిలికితే, ఆయన నిబద్ధ కవి కింద చలామణి అయినట్లేనా? ఆ నాలుగైదు పేజీల మీద ఓ నలభై పేజీల "తందనాతానా"లు వ్రాసే డి.ఎన్ శాస్త్రులు నిబద్ధత కలిగిన విమర్శకులుగా పరిగణించబడతారా?
సమాజాన్ని గాలికొదిలేసి, అదే గాలిలో మమేకమై, రాత్రి వచ్చిన రహస్యపు వానలో కప్పల నిశ్శబ్దాన్ని మనకు చూపించే ఇస్మాయిల్ కవిత్వంలో నిబద్ధత లేదా! నినాదాలకే పరిమితమయ్యే నిబద్ధత, కవిత్వం కాగలుగుతుందా? ఇలా ఎన్నో సందేహాలు కలిగాయి. ఆ సందేహాల మధ్య మళ్ళీ ఇస్మాయిల్ కవిత్వాన్ని చదివితే, నిజమైన మహాకవి - ఈ శతాబ్దం నాది అని సగర్వంగా ప్రకటించిన శ్రీశ్రీని మించిన నిబద్ధుడైన కవిగా నాకు ఇస్మాయిల్ కనిపించారు. కావాలంటే, ఇస్మాయిల్ వ్రాసిన కొన్ని పద్యాలు చూడండి.
కప్పల నిశ్శ్బదం నుండి :
కాలువ బలిసింది
తన విధులు మరిచింది
వంతెనకి నీడ చూపించటంలేదు
కీచు రాయి చప్పుడుతో
గదంతా నిండిపోయింది
గదిలో నాకు చోటు లేదు
పచ్చిక మొలిచి
బాటని కప్పేసింది
మళ్ళీ ఎన్ని వందల కాళ్ళవసరమో!
ఊరు నిద్దరోయాక
చెరువు మేల్కొంది.
అర్వాత ఎవరికీ నిద్ర లేదు
ముందు మనస్సునీ
ఆ వెనక గదినీ
తర్వాత విశ్వాన్నీ ఆవరించింది చీకటి
చెరువు.
చెరువులో ప్రతిబింబాలు
వాటిని అనుకరిస్తూ గట్టుపై చెట్లు
చెరువు లేకపోతే
చెట్ల నీడల్ని
ఎవరు చేరదీస్తారు?
ఇవి చాలా కొన్ని మాత్రమే. అన్వయించుకోగలిగిన తెలివితేటలు ఉంటే, పైన చెప్పిన ఒక్కో పద్యము సామాజికతనే చెబుతున్నది, చెంప ఛెళ్ళుమని మోగిస్తున్నది.
మన పరిణతికి అనుగుణంగా మనం కవిత్వాన్ని చదివి ఊరుకుంటే బానే ఉంటుంది. అంతేకానీ, అర్ధంపర్ధంలేని వర్గీకరణలతో కవుల గుంపులు తయారు చేయటం వలన ఉపయోగం ఉండదు. కేవలం, పరిమితమైన అవగాహన వల్ల, ఆలోచనా పరిమితుల వలన మాత్రమే ఇలాంటి వర్గీకరణలు చేయటం జరుగుతుంది. వీరి ఆలోచనలో, నినాదాలు గుప్పించి వ్రాసే ప్రతిదీ "నిబద్ధ కవిత్వమనే"!
మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పైపైకి అంటే, ఎక్కడికా పోయేది అన్న ఆలోచనే కలుగుతుంది.
ఎముకలు కుళ్ళిన, వయస్సు మళ్ళిన సోమరులారా చావండి అంటే, ఆలోచన అక్కడే ముగిసిపోతుంది.
మూల పడి ఉంది గొడుగు
వానలొస్తే కానీ
ఇది వికసించదు
అన్న పై వాక్యాల్లో ఆలోచిస్తున్న కొద్దీ అనేక అర్ధాలు స్ఫురిస్తాయి. ఇదీ నిబద్ధమైన కవిత్వం అంటే. చదువుకునేవాడికి ఆహ్లాదం కావాలంటే అంతవరకే కలిగిస్తుంది. ఆలోచించే వాడికి, సామాజిక అవసరాన్ని కూడా పై కవిత్వం గుర్తు చేస్తుంది. ఇస్మాయిల్ శ్రీశ్రీలా "నిబద్ధ కవి" కాదంటారా?