Tuesday, August 5, 2008

మేడిపండు ప్రజాస్వామ్యం 04

ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమని ఛాతి విరుచుకొని మరీ గర్వంగా నిలబడతాం. అందరికీ అన్నిటా సమాన హక్కులు కల్పించే రాజ్యాంగం మన సొత్తని చెప్పుకుంటాం. నిజానికి, అటు కొంత, ఇటు కొంత చేతివాటంతో తెచ్చుకొని అంటుకట్టిన రాజ్యాంగం మనది. ఇది దివాలాకోరు రాజ్యాంగం అని చెప్పటానికి పెద్ద చదువులు చదవాల్సిన అవసరం లేదు. సామాన్యపరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. అందరికీ అన్నిటా సమాన హక్కులు కల్పించే రాజ్యాంగమా!

అణగారిన, నిమ్నజాతులవారికి సమాజంలో ఓ స్థానం కల్పించటానికి మన రాజ్యాంగవేత్తలు రిజర్వేషనులు కల్పించారు. అది తప్పు అని చెప్పను. కానీ, ఏ నెపంతోనైనా, కొన్ని వర్గాలకి రిజర్వేషనులు కల్పించే రాజ్యాంగం అందరికీ సమానహక్కులు కల్పిస్తున్నదని చెప్పటం ఎంతవరకూ సముచితం. అంటే పేరుగొప్ప రాజ్యాంగమే కానీ, నిజానికి అందరికీ సమానహక్కులు కల్పించటంలేదన్నది తేలిపోతున్నది కదా!

అదే విధంగా, మన ఘనతవహించిన లౌకిక రాజ్యంలో, స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్దాల పైమాటే అయినా, యూనిఫాం సివిల్ కోడ్ ఎందుకని తీసుకురాలేకపోయారు? భారతదేశంలో అవిభాజ్యమైన భాగంగా ఒప్పుకోవాల్సిన కాశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? ఇవన్నీ, ప్రజలకు ఆయా ప్రాంతాలకు సమానహక్కులు కల్పిస్తున్నట్లేనా?

చట్టసభలలో ప్రాతినిద్యం కల్పించటానికి అనేక కులాలకు, మతాలకు, నియోజకవర్గాలను ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు - సంతోషం. ఈ కేటాయింపులు ఏ ప్రాతిపదికన జరుగుతున్నాయో మన ప్రధానికైనా తెలుసా? అసలు ఆ మాటకొస్తే, లౌకిక దేశంలో కుల మత ప్రాతిపదికన ఈ కేటాయింపులేమిటి? అందులోనూ చట్టసభలలోకి. సమానహక్కులు కల్పించటమే రాజ్యాంగ ధ్యేయమైతే, అన్ని కులాల, మతాల జనాభా ప్రాతిపదికగా కేటాయింపులు ఎందుకు చేయరు?

ఒకరికి (షాబానో) అన్యాయం జరుగుతున్నదని తెలిసినా, అది అన్యాయమని సుప్రీంకోర్టు ప్రకటించినా, చట్టపరంగా తగిన మార్పులు చేయగలిగిన సంఖ్యాబలం పార్లమెంటులో ఉన్నా, ఏమీ చేయలేని ప్రధానులు మనకున్నారు. ఎందుకంటే, ఒక అబలకు సాయం చేసే క్రమంలో ఆ మతాధికారుల ఆగ్రహానికి గురై, ఓట్లు కోల్పోతామేమోనన్న భయం మన సెక్యులర్ ప్రధానులందరిదీ.

గుజరాత్ లో మారణహోమం ఎలా మొదలయ్యిందో, ఎలా కొనసాగిందో అందరికీ తెలుసు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ, నరేంద్ర మోడీకి కితాబులిచ్చిన అప్పటి ప్రధాని వాజ్ పేయి, ఆ తర్వాతి సార్వత్రిక ఎన్నికల్లో అదే మోడీకి చీవాట్లు పెట్టి, తన పదవీకాలంలో అదో చీకటి అధ్యాయంగా పేర్కొనటం మన సెక్యులర్ రాజకీయాలకే సాధ్యం.

అయోధ్యలో రామమందిరం కోసం ప్రాణపరిత్యాగానికైనా సిద్ధమని తొంభైలలో ప్రకటించి, ప్రజల ఆవేశకావేశాలతో రాజకీయాలాడి, ఇప్పుడు అందరి ఆమోదమో లేదంటే కోర్టు తీర్పో శిరోధార్యమని ప్రకటించటం కొత్తగా సెక్యులర్ పట్టా పుచ్చుకోవాలని ఆశించే భా.జ.పా. ప్రయోగాలే అని ప్రజలు సరిపుచ్చుకోవాలి. వీరివల్ల దేశంలోని రెండు ప్రధాన మతాల మధ్య ఏర్పడిన అగాధం ఇంకా పూడనే లేదనేది విస్మరించలేని మరో సత్యం!

దేశాన్ని రెండుగా చీల్చాడని జిన్నాను ఆడిపోసుకునే అద్వాని ఆ తర్వాత పాకిస్తాన్ వెళ్ళి మరీ, ఆ జిన్నాను కొనియాడటం ఈ సెక్యులర్ తెంపరితనంలో భాగమే.

దేశ స్వాత్రంత్ర్యోత్సవ సంబరాలను, రిపబ్లిక్ దినోత్సవాలను బహిష్కరించాలని పిలుపులిచ్చే బుఖారీలను, సలాఉద్దీన్ లను ఏమీ అనలేక చోద్యం చూసే ప్రభుత్వాలే, మ్యాచ్ గెలిచిన తర్వాత జెండా మీద సచిన్ బోర్ల పడ్డాడనో, మందిరా బేడి చీరలా కట్టిందనో నానాయాగీ మాత్రం చేస్తారు.

హిందువుల ఆరాధ్యదైవానికి చారిత్రక ఆధారాలు లేవనే కేంద్ర ప్రభుత్వం తన లౌకికత్వాన్ని చాటుకోటానికి ఆ మాట అనటంలేదని సామాన్యప్రజలు గ్రహించాలి. కరుణానిధికి కోపం తెప్పించి తమ ప్రభుత్వాన్ని పడిపోకుండా చేసే ప్రయత్నంగానే భావించాలి!! అవే చారిత్రక ఆధారాలు ఇతర మతస్థులను అడిగే ధైర్యం ఏ ప్రభుత్వమూ చేయలేదు. వాటిని కూడా ఓట్ల కోసం వాళ్ళ అవస్తలుగా పరిగణించి ప్రజానీకం వదిలేయాలి.

అసలు విషయం దారితప్పినట్లుంది. ఏతావాత చెప్పొచ్చేదేమిటంటే, ఈ దేశంలో సమానహక్కులనేవి అభూతకల్పనగానే భావించాలి. వ్యక్తిగా ఒకని ఓటుకున్న విలువకన్నా, కులమత్ర ప్రాతిపదికన ఒక సమూహంగా ఉన్న ఓట్లకున్న విలువే ఎక్కువ.

దీనికి లేటెస్టు ఉదాహరణ, ఆంద్రజ్యోతి - మంద కృష్ణ మాదిగ వ్యవహారం. పేరులో కులాన్ని చొప్పించుకునే నాయకులు, ఆ నాయకుడి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తే, ఆ కులాన్నే దూషించినట్లుగా పోలీసు కేసులు వేయటం, రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసు ఆధారంగా జర్నలిస్టులను అరెస్టు చేయటం మన లౌకిక ప్రజాస్వామ్యంలోనే జరుగుతుంది. అదే కుల నాయకుడి ఆధ్వర్యంలో ఈ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మనే ఇదివరలో తగలబెట్టినప్పుడు నోరు మెదిపినవాడు లేడు. అలానే, ఈ కుల నాయకుడి ఆద్వర్యంలోనే, అరెస్టు కాబడ్డవారి దిష్టిబొమ్మలు తగులబెట్టినప్పుడు కూడా అందరూ మూసుకున్నవాళ్ళే! వాడంటే తిట్టు, వీడంటే బూతా! ఇదా మన లౌకిక ప్రజాస్వామ్యం? ఇవా మనకున్న సమాన హక్కులు?

ఏ రాజ్యాంగమైతే మనది లౌకిక ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించిందో, అదే రాజ్యాంగం కులమత ప్రాతిపదికగా ప్రజల్ని విడదీస్తోంది. ఆ నెపాన్ని సామాజిక అసమానతల మీద వేసినా, తప్పు తప్పే. సామాజిక అసమానతలను పోగొట్టటానికి మరేవిధమైనా దారులు మన రాజ్యాంగవేత్తలకు దొరకలేదంటే, అది ఆ రాజ్యాంగవేత్తల్లో సత్త లేకపోవటమే కారణంగా చెప్పుకోవచ్చు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయం :