పార్టీల వ్యవస్థల గురించి గతంలో కొద్దిగా మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు దాన్నే మరి కొద్దిగా తరచి చూద్దాం. ఒక కుటుంబ పాలనలో దాదాపు అయిదు దశాబ్దాలు మగ్గిన దేశం మనది. దేశానికి, దేశప్రజలకు జవాబుదారీ వహించాల్సిన నేతలు, తమ స్వార్ధం కోసం (ఎన్నికల్లో టిక్కెట్టు కోసమో, పదవుల కొసమో) ఆయా కుటుంబాలకు ఎనలేని విధేయత ప్రకటించటం రివాజుగా మారింది కాంగ్రెస్ తోనే. క్రమేణా అదే ఒక సంస్కృతిగా మారి అన్ని పార్టీలకు పాకింది. అంతర్గత ప్రజాస్వామ్యమనేది మచ్చుకు కూడా కనిపించకుండా పోయింది. ఒక విషయంలో పార్టీ వైఖరిని నిరసించటం, ఆ కుటుంబానికి అవిధేయత ప్రకటించటంగా కూడా పరిగణించటం కద్దు.
లౌకికత్వానికి, సమసమాజానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పుకునే జాతీయ, ప్రాంతీయ పార్టీలు చాలావరకు ఈ వలయంలో ఉన్నవే. కరుణానిధి అయినా దేవెగౌడ అయినా, లాలూ యాదవ్ అయినా ఎన్.సి.పి. అయినా, శివసేన అయినా, తెలుగుదేశం - తెరాసలయినా అన్నీ అవే తాను ముక్కలు. పార్టీలోనూ పదవుల్లోనూ ముఖ్యమైన పదవులన్నీ ఆయా కుటుంబాలవే.
ఇందిరాగాంధి మరణించిందని ఆమె కొడుకు, ఇంద్రారెడ్డి మరణించాడని ఆయన భార్య, పరిటాల రవి మరణించాడని ఆయన భార్య, పి.జె.ఆర్. మరణించాడని ఆయన కొడుకు. నిజానికి ఆయా పార్టీ కుటుంబాలే కాకుండా, పార్టీల్లోని చిన్న పెద్ద నేతలు కూడా ఆయా నియోజకవర్గాల్లో తమతమ కుటుంబపాలనే ఉండేలా చూసుకోవటానికి తాపత్రయ పడటం ఎంతవరకు ప్రజాస్వామ్యయుతం?
అలా సర్పంచ్ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకూ ఆయా నియోజకవర్గాలను కొన్ని కుటుంబాలపరం చేయటం మన ప్రజాస్వామ్యపు ఘనతే! కుటుంబపాలనను నిరసిస్తూ వచ్చిన పార్టీలలో కూడా అదే ఒరవడి.
దేశానికేం చేసాడన్నదానికన్నా కూడా, ఆ పార్టీ కుటుంబపెద్దకు ఎలాంటి గౌరవమర్యాదలు చేసాడన్నది ముఖ్యమయ్యింది. ఒకప్పుడు ప్రధానిగా పనిచేసినా, ఒక పార్టీ కుటుంబపెద్దకు తగిన గౌరవమర్యాదలు చేయలేదని, మరణించిన ఆ మాజీప్రధానికి ఎలాంటి సత్కారాలు చేసారో మనమెరుగుదుము. ఆ మహానుభావుడి శవాన్ని కాకులకు కుక్కలకు వదిలేసారు!!
ఆ కుటుంబ (పార్టీ) పెద్ద చెబితే, వాళ్ళ ఇల్లు ఊడ్చటానికైనా సిద్ధమనే వారికి అన్నీ తాయిలాలే! అలా రాష్ట్రపతులైనవారూ ఉన్నారు. సరే, దిగజారి ఏం చేయటానికి సిద్ధపడ్డా టిక్కెట్ ఇవ్వకపోయే సరికి ఆ పార్టీని వదిలి, ఆ మర్నాడే అదే పార్టీని అమ్మనాబూతులు తిట్టే నాయకమ్మణ్యులూ మనకున్నారు. అలానే, అమ్మవారికో అయ్యవారికో వీరవిధేయత చూపించే ఇతర నాయకులు కూడా, పార్టీ వదిలి వెళ్ళినవారు దేశానికి, రాష్ట్రానికి ఎంత ద్రోహం చేసారన్నది కూడా కళ్ళకు కట్టినట్లు చెబుతారు. వాడు ఆ పార్టీలో ఉన్నప్పుడు అన్నీ మూసుకున్న ఆ వీరవిధేయులు, వాడు బయటకు వెళ్ళగానే, నోరు తెరవటంలోని ఔచిత్యం మనం ప్రశ్నించం.
అలా బయటకు వచ్చి - వాపును చూసి బలుపు అనుకుని వేరే కుంపట్లు పెట్టేయటం ఓ వ్యాపారమయ్యింది. అదృష్టం బాగుండి ఒకట్రెండు సీట్లు వచ్చినా ఆ సీట్లతో కోట్లు రాబట్టటం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అసాధ్యమేమీ కాదు.
సిద్ధాంతాలకు విలువనిచ్చే పార్టీలూ మృగ్యం, సిద్ధాంతాలు మెచ్చి పార్టీలో చేరే నాయకులూ మృగ్యం. నిన్నటిదాకా, శివసేనలో ఉండి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేసి, అతివాద హిందువుగా పేరు తెచ్చుకున్న నారాయణ్ రాణే, కాంగ్రెస్ లో చేరి ఎంత అవలీలగా లౌకికవాదిగా మారోడో చూడండి! ఏ నేతను తిరస్కరించి, వేరే కుంపటి పెట్టాడో, ఇప్పుడు అదే వ్యక్తి అధ్యక్షురాలుగా ఉన్న కూటమిలో చేరి మంత్రి పదవి కూడా అనుభవిస్తున్నాడు శరద్ పవార్!
అయిదు సంవత్సరాలు ఎన్.డి.ఎ.కు మద్దతు ఇచ్చి, కావాల్సినవన్నీ పొంది, ఆ పిమ్మటి ఎన్నికల్లో ఓడిపోయినందుకు ఎన్.డి.ఎ.తో పొత్తు కారణంగా చెప్పి, మళ్ళీ కమ్యూనిస్టులకు దగ్గరౌతున్నాడు చంద్రబాబు. తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని లౌకికవాదం, ఎన్నికల్లో ఓడిపోగానే గుర్తుకు రావటం మనకు అసహజంగా అనిపించదు ఎందుకని?
ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడీ అన్నట్లు, జనాకర్షణ ఉన్న ఓ వ్యక్తి కొత్తపార్టీతో వస్తుంటే, ప్రజలు మర్చిపోయిన చాలామంది పాత నాయకుల హడావుడీ ఎక్కువ. కొత్తపార్టీ నేతను ఆకర్షించటానికి చేయని గిమ్మిక్కులుండవు. పాతపార్టీలో ఎంతటి దుర్భర పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేస్తున్నారో ఏకరవు పెడతారు. మరి ఇంతకాలమూ ఈ దుర్భరపరిస్థితుల్లో ఎందుకు ఉన్నారు అనడిగితే ప్రజా సేవే ముఖ్యంగా భావించామని చెబుతారు. అసలు, అధికారం కాకుండా ప్రజాసేవే పరమార్ధమైతే, ఏ పార్టీలో ఉన్నా సేవ చేయొచ్చుకదా!
మరి ఇటువంటి వారితోనే పార్టీ పెట్టబోయేటట్లయితే, చిరంజీవి పార్టీ మిగతా పార్టీలకు భిన్నమెలా అవుతుంది? లోక్ సత్తా పెట్టారు. మంచి ఆశయాలున్న పార్టీగా చెప్పుకున్నారు. మొన్నటిదాకా 'కొత్త' రాజకీయాలు ఆడతామని ప్రకటించిన ఆ పార్టీ ఇప్పుడు, రాజకీయాల్లో ఒంటరిగా ఉండి పోరాడలేము కాబట్టి ఇతర పార్టీలతో పొత్తులు తప్పనిసరి అనే దిశగా తమ భావజాలాన్ని మార్చుకుంటున్నది. అసలు నా అభిప్రాయంలో లోక్ సత్తాకు ఇతర పార్టీలకు ఇంతకు మునుపు నుంచే ఎటువంటి తేడా లేదు. అన్ని పార్టీలలానే, గాంధీ అంబేద్కర్ బొమ్మలతో ఓట్లు అడుక్కునే పార్టీగానే ఇది అవతరించిందని మొన్నామధ్య ఆ పార్టీకి సంబంధించిన ఓ ఫంక్షను చూసినప్పుడే అర్ధమయ్యింది.
కొద్దో గొప్పో సిద్ధాంతపరంగా ఒకస్థాయిలో ఉన్నాయని చెప్పుకోగల వామపక్షాలు, భా.జ.పా.లు కూడా క్రమేణా సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి అవకాశవాద రాజకీయాలకు పెద్దపీట వేస్తున్నాయి. ఆ క్రమంలోనే, మిగతాపార్టీల తరహాలో వీరు కూడా రౌడీలకు, గూండాలకు చోటు ఇవ్వడం జరుగుతున్నది.
ఉన్నతాదర్శాలతో ప్రారంభమైన లోక్ సత్తా వంటి పార్టీలే తమ భావజాలం మార్చుకునే దిశగా ఆలోచిస్తున్నాయంటే, పరిస్థితులు ఎలా దిగజారుతున్నాయో అర్ధమౌతుంది. రౌడీలకు, గూండాలకు ఎన్నికల టిక్కెట్లు ఇవ్వకుండా మనలేని విధంగా మన రాజకీయాలు తయారయ్యాయంటే ఎవరి తప్పు? రాజకీయ నాయకులదా? లేక వారిని శిక్షించేవిధంగా లేని మన రాజ్యాంగానిదా?
ఎన్నికల ముందు ఆ పిమ్మట వీళ్ళ కుప్పిగంతులు చూసితీరాలి. ఎన్నికల ముందు రైతులందరికీ ఉచితంగా ఇస్తామన్న కరెంటు, ఎంతమందికి ఉచితంగా దక్కిందనేది తెలిసిన విషయమే. ఉచితంగా ఇవ్వటం సాధ్యపడేది కాదని అప్పుడు విమర్శించిన చంద్రబాబు, ఈనాడు అందరికీ ఉచితంగా బియ్యం ఇస్తానంటున్నాడు. ఉచితంగా దొరికేదేదో ఊడబెరుక్కోవాలని, జనాలు కూడా మందలుగా ఓట్లేసేస్తారు, వాళ్ళని గెలిపిస్తారు. కనీసపు ఆలోచనతో తమ బుర్రకు పనులు పెట్టని బర్రెలు / గొర్రెలు మన జనాలు.
అయ్యా బియ్యం ఉచితమంటున్నావు, బానే ఉంది. అందులో ఏం వేసుకు తినాలి? పప్పు, నూనె, ఇంధనం వాటి ధరలు ఏమాత్రం ఉన్నాయి ఎవ్వరూ అడగరు. ఆచరణ సాధ్యం కాని పథకాలను మేనిఫెస్టోలో చేర్చి ప్రజలను వంచన చేయటంలో తప్పు పార్టీలదే అయినా, ఆవిధంగా ప్రతిసారి మోసపోవటంలో మాత్రం తప్పు మన ప్రజలదే.
నేను మహారాష్ట్రలో ఠానేలో ఉంటున్నాను. ప్రాంతాన్ని బట్టి, ప్రతిరోజూ దాదాపు 8 నుంచి 15 గంటల దాకా కరెంటు కోత ఇక్కడ. ఈ మధ్యలో ఠానే పార్లమెంటు నియోజకవర్గానికి గాను మధ్యంతర ఎన్నిక వచ్చింది. ప్రచారానికి పది రోజుల ముందు నుంచి ఎన్నికలైన రెండు రోజుల దాకా కరెంటు కోత అనేదే లేదు. ప్రతిరోజూ గంటల తరబడి కోతవిధించబడుతున్నా, ఆ పన్నెండు రోజులు కోతలేని విద్యుత్తు ఎలా ఇవ్వగలిగారో?
ఇంకా విచిత్రం. ఈ విద్యుత్ కోత గురించి మాట్లాడే నాధుడే లేడు. అదే మీనాతాయి విగ్రహంపై ఎవరో దుమ్ము వేసారని ముంబాయి మొత్తాన్ని హడలెత్తించిన శివసేన, ఇంకా భా.జ.పా.లు అసలు విద్యుత్ ఊసే ఎత్తరు. ఎన్నికల ముందు మాత్రం హోరెత్తిస్తారు కరెంటు ఉచితంగా ఇస్తామని. అసలు కోతలే లేకుండా చూస్తామని.
ఏ పార్టీ చరిత్ర ఏ రాష్ట్రంలో చూసినా గర్వించదగ్గదేమీ లేదు. ఏ రాజకీయనాయకుడి చరిత్ర ఏ పదవిలోనైనా గర్వించదగ్గదేమీ చేయలేదు.
మన వ్యవస్థను, రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని చెప్పే మేధావినైతే కాదు. లోపాలేమిటనేవి మాత్రం గమనించే సాథారణ పౌరుడిని మాత్రమే. అయినా, నా పరిణితికి, నా ఆలోచనా పరిమితులకి లోబడి నేను ప్రస్తావించదలుచుకున్న మరికొన్ని విషయాలు త్వరలోనే తెలుపుతాను.
ప్రజాస్వామ్యంలో యథా ప్రజ తథా రాజ! చక్కటి విషయాన్ని ప్రస్తావించారు.
ReplyDelete